kalvakuntla kavitha:ఎమ్మెల్సీ పదవి రాజీనామా అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. తాను స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించానని తెలిపారు. మండలి ఛైర్మన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తనకు తెలియదని అన్నారు. రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఫోన్ చేశానని ఆమె తెలిపారు. కావాలంటే మరోసారి లేఖ పంపిస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు.
కేసీఆర్ లాగే తాను: తాను కొత్త పార్టీ పెట్టే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెట్టే ముందు గతంలో కేసీఆర్ గారు వందల మందితో చర్చలు జరిపారని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం తాను అదే పని చేస్తున్నానని తెలిపారు.
కాంగ్రెస్లో చేరే ఆలోచన లేదు: తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన అస్సలు లేదని కవిత అన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదని అన్నారు. నేను కూడా ఎవరినీ అప్రోచ్ కాలేదని తెలిపారు. ముఖ్యమంత్రే కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నారేమో అని వ్యంగ్యంగా కవిత వ్యాఖ్యానించారు. ఒక వర్గం కోసం కాకుండా ప్రజలందరి కోసం పనిచేయాలనుకుంటున్నానని చెప్పారు. అయితే బీసీల సమస్య తన మనసుకు దగ్గరైందని తెలిపారు. తాను ప్రస్తుతం ‘ఫ్రీ బర్డ్’నని అన్నారు. తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. చాలా మంది నేతలు వచ్చి కలుస్తున్నారని పేర్కొన్నారు. తనతో టచ్లోనే ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ కూడా చాలా పెద్దదేనని కవిత అన్నారు.
2016లోనే కేటీఆర్ను అలర్ట్ చేశా: తండ్రి పార్టీ నుంచి సస్పెండైన మొదటి కూతుర్ని తానేనంటూ కవిత చలోక్తులు విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ను అలర్ట్ చేశానని తెలిపారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో తప్ప హరీష్ రావుపై తనకు మరో విషయంలోనూ కోపం లేదని కవిత అన్నారు.


