Kavitha Demands Telangana Govt To Buy Wet Paddy Give Compensation: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పత్తి రైతులను తేమ పేరుతో దారుణంగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల్లో అధికారులు సృష్టిస్తున్న ఇబ్బందుల వల్ల రైతులు గిట్టుబాటు ధర కోల్పోయి, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “తేమ సాకుతో సీసీఐ అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో దిక్కులేక రైతులు తమ పంటను ప్రైవేటుకు అమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతంలో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది” అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఆపి, తక్షణమే రైతుల సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిని గిట్టుబాటు ధరకు సీసీఐ కొనుగోలు చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంతకుముందు ఆదిలాబాద్కు చేరుకున్న కవితకు తెలంగాణ జాగృతి నాయకులు, ఆదివాసీలు గుస్సాడీ నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక రైతులు, ఆదివాసీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..
మొంథా తుపాన్ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాటలో భాగంగా ఇటీవల కరీంనగర్ జిల్లాలో కవిత మొదటి రోజు పర్యటన చేశారు. మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయకపోవడంతో వర్షాలకు తడిసిపోయి రైతులు మరింత నష్టపోయారని, ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించి తడిసిన ధాన్యం కొనుగోలు జరిపించాలని డిమాండ్ చేశారు. తుపాన్ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు కేవలం రూ. 10 వేలు పరిహారం ఇస్తామంటే కుదరదని, రైతులకు మేలు జరగాలంటే ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పంట నష్టం అంచనా వేయలేదు. ప్రభుత్వం, కలెక్టర్, అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వెంటనే పంట నష్టం సర్వే చేసి నివేదికలు ఇచ్చి రైతులకు పరిహారం అందేలా ప్రభుత్వం ఆదేశించాలన్నారు.


