రాష్ట్రంలో ఇటీవలే గ్రూప్- 1 పరీక్ష నియామక ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, గ్రూప్-1 నియామక ప్రక్రియపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేంది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. గ్రూప్-1 నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయాని.. ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సైతం ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లోని శిల్పకళావేదికలో 562 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు కవిత లేఖలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల ట్రాన్స్లేషన్ లోపాల వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సమాధాన పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని ఆరోపించారు. దీంతో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు వచ్చాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని లేఖలో వివరించారు.
అదేవిధంగా ప్రిలిమ్స్ పరీక్షకు ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ పరీక్షకు మరో హాల్ టికెట్ నంబర్ కేటాయించారని.. ఇది అనేక అనుమానాలకు తావిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నట్లు కవిత లేఖలో ప్రస్తావించారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపి, గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కవిత డిమాండ్ చేశారు.


