Wednesday, September 18, 2024
HomeతెలంగాణSingireddy Niranjan Reddy: కెసిఆర్ ఆలోచన సాహసోపేత నిర్ణయం

Singireddy Niranjan Reddy: కెసిఆర్ ఆలోచన సాహసోపేత నిర్ణయం

దశాబ్దాల గిరిజన రైతుల కల తీర్చిన కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన, సాహసోపేత నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 2845 గ్రామ పంచాయతీ తాండాల్లో 1.50 లక్షల మందికి 4.35 లక్షల ఎకరాలు పోడు పట్టాలుగా పంపిణీ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . ఇది భారత దేశంలోనే ఒక రికార్డుగా అభివర్ణించారు. వనపర్తి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి జిల్లాకు సంబంధించిన గిరిజన లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గిరిజనులు అటవీ ప్రాంతంలో ఉంటూ దశాబ్దాల కాలంగా పోడు భూమిని సాగు చేసుకుంటూ భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారనీ, అలాంటి గిరిజనులు తమ భూమి దక్కుతుందో లేదో అనే బెంగ నిత్యం పెట్టుకుని జీవించే వారు. అలాంటి గిరిజన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం వల్ల అటవీ హక్కుల పత్రాన్ని అర్హులైన వారందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించకుండా అటవీ శాతాన్ని హరితహారం ద్వారా మొక్కలు నాటి ఏడు శాతం అటవి విస్తీర్ణం పెరిగిందన్నారు. ఇకముందు గిరిజనులు ఎవరూ కొత్తగా చెట్లు నరకకుండా హామీ పత్రం తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

- Advertisement -


ఎక్కడైనా సరైన సర్వే చేయకుండా లేదా సరైన పత్రాలు సకాలంలో చూపించడంలో జాప్యం జరిగి అర్హత ఉండి పట్టాలు రాని వారికి మరోమారు సర్వే చేయించి అర్హులైన వారందరికీ పూడు పట్టాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు పట్టలు రానివారు ఎలాంటి బెంగ పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పొడి పట్టాలు వస్తాయని తెలియజేశారు. పోడు పట్టాలు పొందిన రైతులు ఎకరాకు 15 చెట్లు చొప్పున పెంచాలని, తద్వారా అడవిని సంరక్షించాలని తెలిపారు. చెట్లు పెంచితెనే జీవకోటికి మనుగడ అని అవి మనుషులకు ప్రాణవాయువు అందిస్తుందన్నారు. తండాల్లో నాగరికత పెరిగి ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని అభివృద్ధి చెందారని దానికి కారణం వారిలో ఉన్న కష్టపడే తత్వమని అభినందించారు.


జడ్పి చైర్మన్ ఆర్.లోక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు పోడు భూమి ఒక ప్రధాన సమస్యగా ఉండేదని, పోడు సాగుచేసుకునే రైతులకు అటవీ శాఖ ద్వారా ఆంక్షలు ఉండేది అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల గిరిజన రైతుల కల నెరవేర్చిందని, గిరిజన పోడు రైతులకు అటవీ హక్కుల పత్రం జారి చేయడం జరిగిందన్నారు. ఇకమీదట పోడు పట్టాల రైతులకు సైతం రైతుబంధు రైతు బీమా లభిస్తుందని అందువల్ల వడ్డీ వ్యాపారం చేసే దళారుల చేతుల్లో మోసపోవద్దని రైతులకు సూచించారు. ఎవరైనా రైతులు వాణిజ్య పంటలు సాగు చేస్తే బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు సైతం లభిస్తుందని అన్నారు. ఈరోజు పోడు పట్టాలు పొందిన రైతులకు ఎంత సంతోషం ఉందో అంతకంటే ఎక్కువ సంతోషం ప్రభుత్వానికి ఉందని తెలియజేశారు. ఇంకా ఎవరైనా అర్హులు పోడు పట్టాలు రాకుండా మిగిలిపోయి ఉంటే వారికి సైతం పోడు పట్టాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి, మండల స్థాయిలో కమిటీలు పరిశీలన చేసి చివరగా జిల్లా స్థాయి కమిటీ ద్వారా 415 మంది రైతులకు, 481 ఎకరాల భూమికి ఆర్. ఒ.ఎఫ్.ఆర్. అటవీ హక్కుల పత్రం పొందేందుకు అర్హులుగా నిర్ధారించడం జరిగిందన్నారు. వీరందరికి నేడు మంత్రి చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పోడు పట్టాలు జారీ చేయడం లో సహకరించిన మంత్రి వర్యులకు, అటవీ శాఖ సిబ్బందికి, గిరిజన అభివృద్ధి శాఖ సిబ్బంది, కమిటీ సభ్యులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు. వనపర్తి జిల్లాలో సాగు నీరు, తాగు నీరు పుష్కలంగా ఉన్నందున వలస పోయిన వారు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకొని వ్యవసాయం, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇకముందు కూడా జిల్లా అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం అందించాలని కోరారు. పోడు పట్టాలు పొందిన లబ్దిదారులకు రైతు బంధు, రైతు బీమా పొందేందుకు అర్హులు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పోడు పట్టాలు పొందిన గిరిజన మహిళా రాజపేట మండలం పెడ్డతాండ మహిళా రైతు కాత్రావట్ ధర్మాని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల మా కల నేడు సాకారం చేసినందుకు, ముఖ్యమంత్రి కి, మంత్రి నిరంజన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో డి.ఎఫ్. ఒ నవీన్ రెడ్డి, డి.టి.డి. ఒ శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, ఘనపూర్ ఎంపిపి కృష్ణా నాయక్, జడ్పీటిసి సామ్య నాయక్, ఎంపిటిసి ధర్మ నాయక్, సర్పంచ్ పిన్యా నాయక్, జాత్రు నాయక్ , అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News