తెలంగాణ మాజీ సీఎం, BRS అధినేత దాదాపు ఏడు నెలల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈనెల 9 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని గులాబీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. అక్కడ నుంచే పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఇక గత ఏడాది కాలంలో కేవలం మూడుసార్లు మాత్రమే తెలంగాణ భవన్ లో సమావేశాలు నిర్వహించారు. మరోవైపు రెండు వారాల క్రితం జరిగిన సమావేశాల్లో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. ఈ క్రమంలో గులాబీ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు గులాబీ బాస్.
ఇదిలా ఉండగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మార్చి 12 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ హాజరుకాబోతున్నారు. ఏడు నెలల క్రితం గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అప్పటి నుంచి మళ్లీ అటువైపు చూడలేదు. దీంతో అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కేసీఆర్ సభకు హాజరుకాకపోవటంపై విమర్శలు సంధిస్తున్నాయి. సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు.
ఇక త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాను కూడా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో.. సభకు హాజరు కావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ హాజరవడం పక్కా అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ సమావేశాల్లో SLBC, కాళేశ్వరం, అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును కేసీఆర్ ప్రశ్నిస్తారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.
మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి రావడంపై గులాబీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సభకు హాజరైతే ఆయనను అవమానిస్తారని, అధికార పార్టీ నేతలు అవహేళన చేస్తారని అందుకే ఆయన సభలకు దూరంగా ఉండటం మంచిదని కొందరు అంటున్నారు. మరోవర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనని కోరుతున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది.