తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు(Inter Exams) జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈమేరకు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అత్యధికంగా 244 సెంటర్లు హైదరాబాద్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. దూర ప్రాంతాలకు బస్సులు నడపాలని కోరామని ఆర్టీసీని కోరామని చెప్పారు. ఇప్పటికే హాల్ టికెట్ల పంపిణీ కూడా పూర్తయిందన్నారు.
ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. విద్యార్థులు ఉదయం 8 గంటల 45 నిమిషాలకే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. ప్రతీ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూస్తామన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల వివరాల కోసం హాల్ టికెట్లలో క్యూ ఆర్ కోడ్ ఇచ్చామని వివరించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 4,88,448 మంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్.. 4,40,788 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు.