KFC Chicken: కేఎఫ్సీ చికెన్ ఎంత పాపులరిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా కేఎఫ్సీ చికెన్ను లొట్టలేసుకుని తింటుంటారు. మీరు కూడా కేఎఫ్సీ చికెన్ను బాగా ఇష్టపడుతారా? అయితే, ఈ షాకింగ్ న్యూస్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే. నగరంలో అనేక ఫుడ్ స్టాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్లోని వేణుమాల్లో గల కేఎఫ్సీ స్టోర్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కేఎఫ్సీలో కుల్లిపోయిన చికెన్ను వాడుతున్నారని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఓ కస్టమర్ ఇచ్చిన కంప్లైయింట్ ఆధారంగా చేసిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.
కుళ్లిపోయిన చికెన్, అపరిశుభ్రమైన కిచెన్..
పూర్తి వివరాల్లోకి వెళ్లే.. నిజామాబాద్కు చెందిన ఓ కస్టమర్ స్థానిక వేణుమాల్లోని కేఎఫ్సీ సెంటర్లో లెగ్ పీస్ ఆర్డర్ చేశాడు. కాసేపటి తర్వాత సిబ్బంది కుళ్లిపోయిన చికెన్ తీసుకువచ్చి ముందు పెట్టారు. దాన్ని తింటుండగా వాసన రావడంతో వెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు. అయినప్పటికీ సిబ్బంది క్షమాపణలు చెప్పకుండా కస్టమర్పైనే దురుసుగా ప్రవర్తించారు. దీంతో కస్టమర్లకు, సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఘటనపై బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. దీంతో, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులపై నెటిజన్లు ఫైర్..
ఇటీవలే, హైదరాబాద్ కూకట్పల్లిలో సరిగ్గా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. చికెన్ తినేందుకు సాయితేజ అనే వ్యక్తి కూకట్పల్లిలోని కేఎఫ్సీ సెంటర్కు వెళ్లి చికెన్ ఆర్డర్ ఇవ్వగా.. కేఎఫ్సీ సిబ్బంది సరిగా ఉడకని చికెన్ పీస్లను సర్వ్ చేశారు. అది చూసి అవాక్కైన కస్టమర్ సిబ్బందిని ప్రశ్నించాడు. వారు తన కంప్లైంట్ను పట్టించుకోకపోగా దురుసుగా ప్రవర్తించడంతో ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. హైదరాబాద్లోని జెఎన్టీయూ మెట్రో కేఎఫ్సీ స్టోర్ నుంచి తీసుకున్న చికెన్లో నాణ్యత లేదని.. పీస్ అస్సలు ఉడకలేదంటూ సాయి తేజ వాపోతూ ఫోటోలను షేర్ చేశాడు. అంతేకాదు, ఇలాంటి ఆహారాన్ని తింటే కస్టమర్లకు కడుపు నొప్పి సమస్యలు వస్తాయని, కేఎఫ్సీపై చర్యలు తీసుకోవాలంటూ కూకట్పల్లి జోనల్ కమిషనర్ను ట్యాగ్ చేశాడు. దీనిపై జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ స్పందించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే, సాయితేజ పోస్ట్కు అనేక మంది నెటిజన్లు స్పందించారు. కేఎఫ్సీలో తమకు కూడా ఇలాంటి ఛేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్సీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, కేఎఫ్ఎసీ చికెన్ తయారీలో శుచి, శుభ్రత పాటించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులకు గతంలోనే అనేక ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ, వారిపై చర్యలు తీసుకోకుండా కమీషన్లు నొక్కి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.


