Khairtabad Ganesh Shobha Yatra: ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు బయలుదేరారు. పది రోజుల పాటు పూజలందుకున్న మహాగణపతి శోభాయాత్ర శనివారం ఉదయం వైభవంగా మెుదలైంది. ఉదయం 6 గంటలకు పారంభం కావాల్సిన యాత్ర…. కొద్దిపాటి ఆలస్యంతో గణనాథుడిని వాహనంపైకి చేర్చి ఊరేగింపును ప్రారంభించారు. ఖైరతాబాద్ నుంచి మొదలైన ఈ శోభాయాత్ర రాజ్దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్కు చేరనుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ సహాయంతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఎస్టీసీ ట్రాన్స్పోర్టుకు చెందిన 26 టైర్ల ప్రత్యేక వాహనం: 69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువున్న మహా గణపతి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్కు తరలిస్తున్నారు. దీనికై ఎస్టీసీ ట్రాన్స్పోర్టుకు చెందిన 26 టైర్ల ప్రత్యేక వాహనాన్ని వినియోగిస్తున్నారు. దీనికి దాదాపు 100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉంది. ఈ భారీ ట్రాలీపై మహాగణపతిని నిమజ్జన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. గణపతికి ఇరువైపులా ఉన్న లలితా త్రిపుర సుందరి, పూరీ జగన్నాథ్ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలను మరొక వాహనం ఎక్కించి ఊరేగిస్తున్నారు.
బాహుబలి క్రేన్ సిద్ధం: ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న నాలుగో నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 20 క్రేన్లను అందుబాటులో ఉంచింది. వాటిలో ఒకటి భారీ బరువును మోయగల బాహుబలి క్రేన్ కావడం విశేషం.


