Ganesh Immersion: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. గణపతి గంగమ్మ ఒడికి చేరారు. ఈసారి 69 అడుగుల ఎత్తు ఉన్న వినాయకుడు 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్నారు. శనివారం ఉదయం పారంభమైన నిమజ్జనం ఊరేగింపు మధ్యాహ్నం వరకు ట్యాంక్బండ్కు చేరుకుంది. వినాయకుడి విగ్రహాన్ని క్రేన్ సహాయంతో నీటిలోకి దించారు. క్రేన్-4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది.
మారుమోగిన ట్యాంక్ బండ్: మహాగణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రూ. 35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు: పార్వతీ పుత్రుడి చవితి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని గణేష్ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వాటిలో మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేశుడితో పాటు బాలాపూర్ గణపతి యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో లడ్డూ వేలం పలుకుతూ అందరి దృష్టి ఆకర్షించే బాలాపూర్ గణనాథుని చరిత్ర ఎంతో ఘనమైనది. లడ్డూ కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. అందుకే ఈ రోజు జరిగిన వేలంలో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి రూ. 35 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది కొలను శంకర్ రెడ్డి వేలం పాటలో రూ.30.01 లక్షలకు లడ్డూను దక్కించుకోగా.. ఈ ఏడాది మరింత ధర పలికింది.
బాలాపూర్ చరిత్ర – వేలం పాటకు రికార్డ్స్ బ్రేక్: బాలాపూర్లో ప్రతిష్టించే గణపతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఘనమైన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే… వారి ఇంట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బాలాపూర్లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించినట్లు తెలిపారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానిక వ్యక్తి కొలను మోహన్రెడ్డి దక్కించుకున్నారు.


