KTR Alleges Congress: కాంగ్రెస్ ఒక్క పథకం కూడా సరిగా అమలుచేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 23 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలందరికీ అర్థమవుతోందని అన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో కాంగ్రెస్కు ఒక్కసీటు కూడా రాలేదని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన కసరత్తులో భాగంగా.. తెలంగాణభవన్లో కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వెంగళరావునగర్ డివిజన్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
గన్మ్యానే లారీ యూరియా ఎత్తుకెళితే ఎమ్మెల్యే ఇంకెంత!: ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ దోసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన యూరియా కొరత కనిపిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మ్యాన్.. లారీ యూరియా ఎత్తుకెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. ఒక గన్మ్యానే లారీ యూరియా ఎత్తుకెళితే ఎమ్మెల్యే ఇంకెంత దోచుకున్నాడో రైతులకు అర్థమవుతుందని అన్నారు.
కాంగ్రెస్ డబ్బులు పంచి గెలవాలనుకుంటుంది: కాంగ్రెస్ ఒక్క పథకం కూడా సరిగా అమలుచేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టి ఒక్కసారి మాత్రమే రైతులకు ఇచ్చారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు సంగతి దేవడెరుగు కానీ.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు పంచి గెలవాలనుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/mlas-gunman-suspended-for-impersonating-mla-pa/
ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే గన్మ్యాన్ నిర్వాకం: ‘ఎమ్మెల్యే పీఏను మాట్లాడుతున్నాను.. యూరియా లారీ కావాలి’ అంటూ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసిన.. ఎమ్మెల్యే గన్మ్యాన్ నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తెలిసింది. సుమారు 15 రోజుల క్రితం ఎమ్మెల్యే గన్మ్యాన్గా పనిచేస్తున్న నాగునాయక్.. మార్క్ఫెడ్ అధికారులకు ఫోన్ చేశాడు. తాను ఎమ్మెల్యే పీఏనని అధికారులను పరిచయం చేసుకున్నాడు. మాడ్గులపల్లి మండలం కుక్కడం ఎన్డీసీఎస్ కేంద్రానికి యూరియా పంపించాలని వారిని కోరాడు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఆయన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కు ఫిర్యాదు చేశారు.
అధికారుల చర్యలు: ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు గన్మ్యాన్ నాగునాయక్ను వారం రోజుల క్రితం జిల్లా కార్యాలయానికి అటాచ్ చేశారు. సదరు గన్మ్యాన్కు ఛార్జి మెమో అందజేశారు. ఈ ఘటనపై జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్కుమార్ స్పందించారు. ఫోన్ వచ్చిన మాట నిజమే కానీ ఎవరికీ ప్రత్యేకంగా యూరియా లారీ పంపించలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.


