KTR Fire on CM Revanth Reddy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని గిరిజన మహిళలపై పోలీసులు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల చీరలు చింపి కొట్టడం సీఎం రేవంత్ రాక్షసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రాక్షస మనస్తత్వం ఉన్న రేవంత్ రెడ్డి అధికార మదంతో చేసిన ఈ ఘటన అమానుషం అని తెలిపారు. ఇలాంటి వ్యక్తి సీఎం కుర్చీలో ఉంటే రాష్ట్రంలో రాజ్యాంగం ఎలా అమలు అవుతుందని ప్రశ్నించారు.
దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చే హామీ ఇదేనా..? అని నిలదీశారు. దేశంలోని మహిళలకు ప్రియాంకా గాంధీ కోరుకుంటున్న గౌరవం ఇదేనా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తరుచూ మాట్లాడే మానవత్వం ఇదేనా..? అని అడిగారు. ఈ ఘటనపై వీరంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బుల్డోజర్ సంస్కృతికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ తన గుర్తును హస్తం బుల్డోజర్ గా మార్చుకోవాలని విమర్శించారు. గిరిజనల మహిళలను వివస్త్రలను చేసి దాడి చేసిన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా కొత్తగూడెం జిల్లా బూర్లంపాడు మండలంలోని ఇరువైండి బీట్ కోసుగుంపు గ్రామంలో పోడు సాగుదారులకు చెందిన భూముల్లో అటవీ అధికారులు జేసీబీలతో ప్రవేశించారు. దీంతో వారిని గిరిజన మహిళలు అడ్డుకున్నారు. అయితే తమ హక్కుల కోసం పోరాడిన తమపై విచక్షణారహితంగా దాడి చేసి వివస్త్రలను చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదంటూ విమర్శలు చేస్తున్నారు.