KTR Comments on CM Revanth: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ‘‘నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్ట కొట్టారు. చేనేత పరిశ్రమను అతలకుతలం చేశారు. నాపై కోపం ప్రజలపై చూపించొద్దని వేడుకుంటున్నా. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైంది. మీ పాలన అద్భుతంగా ఉందనుకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు పెట్టండి. ఉప ఎన్నికలు పెడితే పాలన ఎలా ఉందో ప్రజలే తేలుస్తారు. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు రేవంత్ సర్కారు జవాబు చెప్పాలి. ఉద్యోగాల కోసం మంత్రి డబ్బులడిగారని అభ్యర్థులే చెబుతున్నారు. సమాధానం చెప్పాల్సింది పోయి మాపై నిరుద్యోగులను ఉసిగొల్పితే ఎలా?’’ అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజీపీ మధ్య రహస్య ఒప్పందం..
‘‘మంత్రులకు తెలియకుండా కాళేశ్వరం కేసును సీఎం సీబీఐకి అప్పగించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎంత మంచి అవగాహన ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో బంధుప్రీతి లేదని ఓవైపు చెబుతూనే తన బంధువులైన సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డికి వందల కోట్ల కాంట్రాక్టులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. కోర్టు తుది తీర్పు వచ్చేదాక అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాలేరని, అజారుద్దీన్ క్రికెట్లో బాగా కట్లు కొట్టేవారు కానీ ఇప్పుడు అజారుద్దీన్కే పెద్ద కట్ కొట్టారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఆయన త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. జనంలోకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు బాగా తెలుసని, సరైన సమయంలో ప్రజల్లోకి వస్తారంటూ వివరించారు.
అన్ని సర్వేల్లో మేమే గెలుస్తామని తేలింది..
‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మొత్తం ఏడు సర్వేలు చేయించాం. ఆ సర్వేలన్నింటిల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని తేలింది. కాంగ్రెస్ చేపట్టిన మూడు సర్వేల్లోనూ మేమే గెలుస్తామని వచ్చింది. ట్రిపుల్ఆర్ విషయంలో భారీ కుంభకోణం జరుగుతోంది. సీఎం బంధువుల కోసం దక్షిణ భాగం అలైన్మెంట్ మారుస్తున్నారు. ఈ కుంభకోణంపై త్వరలో అన్ని వివరాలు బయటపెడతా’’ అని కేటీఆర్ తెలిపారు.


