టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విమర్శలను బీజేపీ నేతలతో పాటు బీసీసీఐ, ఇతర ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“రోహిత్పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది ఎందుకు కోపంగా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. బాడీ షేమింగ్, అవమానకర వ్యాఖ్యలు, భ్రాంతికర ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్షణం. రోహిత్కు కాంగ్రెస్ ప్రతినిధి నుంచి ఫిట్నెస్ సలహా, విజయాలపై ఉపన్యాసాలు అవసరమని అనుకోవడం పెద్ద జోక్.
సినిమా తారలు, వారి కుటుంబ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలతో ఒక తెలంగాణ మంత్రి కోర్టుకు హాజరవుతున్నారని మీకు తెలుసా…? రోహిత్ భాయ్ మీరు అనుభవించిన కఠిన క్షణాలకు తోటి భారతీయుడిగా క్షమాపణలు చెబుతున్నా. మీరు ఒక సంపూర్ణ రాక్స్టార్. ఏ తెలివితక్కువ రాజకీయ నేత అభిప్రాయం మీ ప్రతిష్ఠను దెబ్బతీయలేదు” అని కేటీఆర్ వెల్లడించారు.