KTR Fires on CM Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్లో చేసిన అభివృద్ధి పనులపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివేదిక విడుదల చేశారు. ఇవాళ (బుధవారం) ‘జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక’ పేరిట తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. ‘‘మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నగరంలో ఒక్క ఫ్లైఓవర్, కొత్త రోడ్డు ఒకటి అయినా వేశారా? సీఎం రేవంత్రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు నిరాశ, నిస్పృహకు సంకేతం. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చెసినా.. సీఎం పదవిలో ఉన్న రేవంత్రెడ్డిని గౌరవిస్తా. హైదరాబాద్ అభివృద్ధికి మా పార్టీ ఏం చేసిందో మేం చెప్పేందుకు సిద్ధం. రెండేళ్ల కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రేవంత్ సిద్ధమా? చెత్త ఎవరిదో.. సత్తా ఎవరిదో తేల్చుకుందాం.. నా సవాలును స్వీకరించి సీఎం చర్చకు రావాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్, జూబ్లీహిల్స్ నివాసం, గాంధీభవన్, అసెంబ్లీ ఎక్కడైనా సరే మేం చర్చకు సిద్ధం. పురపాలక, హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు’’ అని కేటీఆర్ సవాలు విసిరారు. ‘అందరికీ అన్నం పెట్టే నగరం హైదరాబాద్. కులం, మతం, ప్రాంతం ఎవరినైనా కడుపులో పెట్టుకొని చూసుకునే హైదరాబాద్ను కేసీఆర్ చంటిబిడ్డలా చూసుకొని బాగు చేసుకున్నారు. తాగునీటి సమస్య తీర్చాం. కొత్త పాలసీలు తీసుకొచ్చి ఐటీని అభివృద్ధి చేశాం. శాంతి భద్రతలు కాపాడి.. అన్ని రంగాల్లో హైదరాబాద్ను అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దాం.” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయి..
ఇక, “కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి,సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు. ఇమామ్లను, పూజారులను, పాస్టర్లు.. ఇలా సబ్బండ వర్ణాలను మోసం చేశారు. అరచేతిలో స్వర్గం చూపించి రేవంత్ రెడ్డి మోసం చేశారు. కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చిందో గుర్తు చేసుకోవాలి’ అని జూబ్లీహిల్స్ ఓటర్లకు కేటీఆర్ సూచించారు. ‘తులం బంగారం, యువతులకు స్కూటీలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, రుణమాఫీ, రైతుబంధులో అన్నింటా మోసం చేశారు’ అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను కేటీఆర్ వివరించారు. విద్యార్థుల ఫీజులు కట్టని సర్కార్.. జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తానంటే ఎలా నమ్ముతామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పీఆర్సీ లేదు.. ఉద్యోగుల బాధలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు. పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి వారు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని అడిగితే.. కాలేజీలపై విజులెన్సు దాడులతో బెదిరింపులకు దిగుతోందన్నారు. రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కారా.. బెదిరింపుల దర్భారా అర్థం కావడం లేదని మండిపడ్డారు.


