అత్యున్నత పదవిలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎందుకింత అభద్రతాభావం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిలదీశారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంపై తీవ్రంగా స్పందించారు.
“వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు..పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చు..ఆయన కళ్యాణలక్ష్మి చెక్కులు పంచొచ్చు..అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయొచ్చు. ఆయనకు పాఠశాల విద్యార్థులను నడిఎండలో నిలబెట్టి పూలుచల్లి స్వాగతం పలకొచ్చు. వారితో ఆయనకు అధికార యంత్రాంగం దగ్గరుండి సెల్యూట్ కొట్టించవచ్చు. ఏ అర్హత లేకున్నా అధికారిక వేదికపై కలెక్టర్ను వెనక్కు నెట్టి వేదికను పంచుకోవచ్చు.
మంత్రి పొంగులేటి పుట్టినరోజున విద్యార్థులను ఎండలో నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయవచ్చ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణికి ఎస్కార్ట్ సదుపాయం కల్పించవచ్చు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 14 ఏండ్లు అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, అస్థిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా ? కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ పాఠశాల హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేస్తారా? కేసీఆర్ పుట్టినరోజున హైదరాబాద్లో ఫ్లెక్సీలు కడితే చించేస్తారా ? ఐఏఎస్, ఐపీఎస్లంటే గౌరవం లేదు..సహచర మంత్రుల మీద నమ్మకం లేదు..అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావమా మీకు..సిగ్గు సిగ్గు” అంటూ కేటీఆర్ విమర్శించారు.