KTR reacted on RTC bus charges: జంట నగరాల్లో సిటీ బస్ ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీస ఛార్జీని ఏకంగా రూ. 10 పెంచడం దుర్మార్గమని అన్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు.‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలా బతకాలో ముఖ్యమంత్రే చెప్పాలి: సిటీ బస్సు ఛార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి రూ. 10 రూపాయలు పెంచిడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు దుర్మార్గమైనవని అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు రూ. 500 అదనపు భారం మోపితే బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని తెలిపారు. ఇప్పటికే విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టిక్కెట్ ఛార్జీలను పెంచింది చాలదన్నట్టు.. ఇప్పుడు కనీస ఛార్జీపై కనికరం లేకుండా 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచడం రేవంత్ అసమర్థ విధానాలకు నిదర్శనమని అన్నారు.
తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకం: రాజధానివాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం రేవంత్ సర్కార్ చేసిందని కేటీఆర్ అన్నారు. దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రి.. హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసిని గట్టెక్కించాల్సిందిపోయి.. సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిదాని కేటీఆర్ అన్నారు.
జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకే: ఆర్టీసీ ఛార్జీల పెంపు వెనుక ఓ కీలక కారణం ఉందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల దశల వారీగా రాబోయే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో 10 డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని.. వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరం అవుతాయని అంచనా. ఈ క్రమంలో డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం ఛార్జీలు పెంచాల్సి వస్తోందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటనలో తెలిపింది. ఇందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.


