Thursday, July 4, 2024
HomeతెలంగాణKTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి

KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని రాష్ట్ర మంత్రి కేటిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు అక్కడి కార్మికులు, అనేక ఇతర సంఘాలు, భారత రాష్ట్ర సమితి వంటి పార్టీలు అడ్డుకుంటున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని వెల్లడించారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు  అప్పజెప్పేందుకు ఏకంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.

- Advertisement -

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మంత్రి మరోసారి కుండబద్దలు కొట్టారు. కేవలం కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ తన ఎజెండా అమలు కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ ను క్రమంగా చంపే ప్రయత్నం  ఎప్పటినుంచో చేస్తుందన్నారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టంచేశారు. స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నదన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెంట్ ను ఉత్పత్తి చేసిన పరిశ్రమలన్నింటిని పూర్తిగా ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాలు, ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలు చేసి వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని తెలిపారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60% వరకు పూర్తిగా ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఐరన్ వోర్, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు కేవలం 40% లోపలనే ఉన్నదని చెప్పారు. పెద్ద ఎత్తున ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి రావడంతో..  వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో  ఉత్పత్తి విషయంలో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, మార్కెట్ లో వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాలను ఎదుర్కొంటుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని దుయ్యబట్టారు. మరోవైపు పూర్తిస్థాయిలో కోకింగ్ కోల్ విదేశాల నుంచే తీసుకురావాల్సిన పరిస్ధితి ఉండడం, స్టీల్ ప్రొడక్షన్ కి అవసరమైన ఐరన్ ముడి సరుకును సైతం ఎన్ఎండిసి నుంచే మార్కెట్ రేట్ కే కొనుగోలు చేయాల్సి రావడం వలన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. దీంతో ఒక ఏడాది కాలంగా సగానికి పైగా ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చిందని,  ఇదంతా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లోకి నెట్టి, ఆ నష్టాలను సాకుగా చూపించి, ప్రైవేట్ పరం చేయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతుందని కెటియార్ హెచ్చరించారు. నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు 12.5 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేసిన ప్రధానమంత్రి మోడీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News