జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
“జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన గోపీనాథ్ పలు పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. గోపీనాథ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.” చంద్రబాబు ట్వీట్ చేశారు.
గోపీనాథ్ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గోపీనాథ్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటని అన్నారు. ఆయన ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. మాగంటి కుటుంబం, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాగంటి అకాల మరణం తమను తీవ్రంగా కలచివేసిందని కేటీఆర్, హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గోపీనాథ్ను కోల్పోవడం బీఆర్ఎస్కు తీరని లోటని పేర్కొన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.
“జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మృతి దిగ్ర్భాంతికి గురిచేసింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరం. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం కృషి చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాగంటి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.” ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.