Tuesday, September 17, 2024
HomeతెలంగాణMahabubabad: ఎస్పీ చిత్రపటానికి పాలాభిషేకం

Mahabubabad: ఎస్పీ చిత్రపటానికి పాలాభిషేకం

పైసా పైసా కూడబెట్టి కూసింత జాగా కొన్న పేదలను బెదిరించి ఆక్రమించేందుకు యత్నించిన కబ్జా కోరులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ జైలుకు పంపించడం హర్షనీయమని బాధితులు పేర్కొన్నారు. తొర్రూర్ మండలంలోని వెలికట్ట శివారు పాలకేంద్రం సమీపంలో పేదలు కొనుగోలు చేసిన భూములను కబ్జా చేసేందుకు విఫల యత్నం చేసిన పలువురిని జిల్లా ఎస్పీ జైలుకు పంపడాన్ని హర్షిస్తూ డివిజన్ కేంద్రంలో బాధితులు ఎస్పీ శరత్ చంద్ర పవార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బాధితులు తెలిపిన వివరాల ప్రకారం , వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన ఆసం చిలుకమ్మ 2010 ఫిబ్రవరిలో మండలంలోని వెలికట్ట గ్రామ శివారు పాలకేంద్రం సమీపంలో 156 సర్వే నెంబర్ లో 303 గజాల భూమిని మిరియాల నరేందర్ రెడ్డి దగ్గర కొనుగోలు చేసాడు.
చిలుకమ్మ కొనుగోలు చేసిన భూమి సర్వే నెంబర్ మార్చి ధరణి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల సమయంలో స్థానికుడు బసనబోయిన వెంకన్న అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. ఇతరులకు దొంగ సర్వే నెంబర్ తో విక్రయించాడు. అది తెలుసుకున్న చిలుకమ్మ ఇటీవల సదరు భూమిలో చిన్నపాటి గదిని నిర్మించారు. ఆ భూమిపై కన్నేసిన స్థానికుడు బసనబోయిన వెంకన్న ఆ నిర్మాణాన్ని కూల్చి ఆక్రమించుకోజూసాడు. ఈ అన్యాయంపై బాధితులు తాజాగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను ఆశ్రయించారు.
బాధితుల సమస్య తెలుసుకున్న ఎస్పీ స్థానిక ఎస్సై గండ్రాతి సతీష్ తో విచారణ జరిపించి బసన బోయిన వెంకన్న, పనస మధులను నిందితులుగా తేల్చి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ పూర్తి ఘటనలో ఎస్పీ బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేసినందుకు స్థలాలు కొనుగోలు చేసిన వారు హర్షం వ్యక్తం చేశారు. కష్టార్జితంతో కొద్దిపాటి స్థలాన్ని కొనుగోలు చేసి ఎలాంటి అండలేని వారికి న్యాయం చేయడంలో పోలీస్ శాఖ కృషి మరువలేనిదని, ఎస్పీ శరత్ చంద్ర పవార్ కబ్జాకోరులకు సింహ స్వప్నంగా మారారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు ఆసం చంద్రమౌళి, ఆసం సుదర్శనాచారి, ఆసం బ్రహ్మాచారి, ముత్తోజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News