Sunday, July 7, 2024
HomeతెలంగాణMahabubnagar: శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సంక్షేమ సంబరాలు

Mahabubnagar: శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సంక్షేమ సంబరాలు

అన్ని కులాలు, మతాలు వర్గాల సంక్షేమంలో భాగంగా మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏదో ఒకరకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది

బడుగు, బలహీన వర్గాలు ,పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహబూబ్ నగర్ లోని శిల్పారామంలో నిర్వహించిన మహబూబ్ నగర్ నియోజకవర్గస్థాయి సంక్షేమ సంబరాలలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి 540 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 5 కోట్ల 40 లక్షల 62 వేల 640 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. బ్యాంకుల అనుసంధానంతో 21 మహిళా స్వయం సహాయక సంఘాలకు కోటి14 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఒక్కొక్కటి లక్ష డెబ్భై ఐదు వేల రూపాయల విలువచేసే 18 గొర్రెల యూనిట్లను రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద పంపిణీ చేశారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల పై ఆధార పడే బీసీ కులాలకు ఆర్థిక అభివృద్ధి చేకూర్చే పథకాన్ని ఈరోజు నుండి ప్రారంభించగా, ఆ పథకం కింద 5 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల ను 100% సబ్సిడీ చెక్కులను అందజేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 52 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించగా, అందులో 38 మందికి లక్ష రూపాయలు చొప్పున, 14 మందికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు .ఇదేకాక కులాంతర వివాహం చేసుకున్న ఒకరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. 144 మంది లబ్ధిదారులకు సాంఘిక సంక్షేమ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు .

- Advertisement -

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 70 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు 200 రూపాయల పెన్షన్లు సైతం సక్రమంగా ఇవ్వలేదని ,అలాంటిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెల 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి పేదలలో భరోసాని కల్పించామని అన్నారు. అతి పేద కులాలు, వృత్తులు చేసుకునే వారికి,కుల వృత్తుల పై ఆధార పడి జీవించే బీసీలకు లక్ష రూపాయల చొప్పున తిరిగి రూపాయి కూడా చెల్లించకుండా 100% సబ్సిడీతో ఏర్పాటుచేసిన బిసి కులాల సంక్షేమ పథకం కింద ఈరోజు నుండే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామని, మహబూబ్నగర్లో 5 మందికి ఈ పథకం కింద చెక్కులు అందించామని మంత్రి వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు, మతాలు వర్గాల సంక్షేమంలో భాగంగా మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏదో ఒకరకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు, కేసిఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నామని, గ్రామాలలో స్మశానవాటికలు, హరితహారం కింద మొక్కల పెంపకం, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రీగేషన్ షెడ్లు ప్రతి ఊరికి ట్రాక్టర్ వంటివి ఏర్పాటు చేశామని, అలాగే ఆయా కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా చేతివృత్తులు, కులవృత్తులకు చేయూతనిచ్చామని ,మత్స్య కార్మికులకు వలలు ఇతర సబ్సిడీ పథకాల అందించామని, చెరువులలో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశామని, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, దళితులకు దళిత బంద్ కింద పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు .మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లి ఐటి కారిడార్ లో రానున్న కాలంలో అనేక పెద్ద కంపెనీలు వచ్చి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, మహబూబ్ నగర్ ను ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఒక బృందంగా ఏర్పడి లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున వచ్చే అన్ని రకాల లబ్ధిని సకాలంలో అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.



జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ఏళ్లలో అనేక సంక్షేమ ఫలాలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారని అన్నారు. సంక్షేమ సంబరాల్లో భాగంగా 54 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద 52 మందికి ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ కింద 18 మందికి గొర్రెల పంపిణీ, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఇంటి పట్టాల పంపిణీ వంటివి అందజేయడం జరిగిందని, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ బీసీలకు ఆయా పథకాల కింద లబ్ధిదారులకు మేలు చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన తెలిపారు .

జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కే.సి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, ఎంపీపీ సుధాశ్రీ , జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి మధుసూదన్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర,మైనార్టీ సంక్షేమ అధికారి టైటస్ పాల్, ఎస్ సి కార్పొరేషన్ ఈ డి యాదయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News