Mahesh Kumar Goud Comments: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు నిందితులు అరెస్ట్ అయ్యారు. తాజాగా SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించారు. ఈ కేసు నమోదుకాగానే ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విచారణకు హాజరుకావాలని.. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో ఆయన అమెరికా నుంచి తిరిగివచ్చి విచారణకు హాజరయ్యారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులతో పాటు ఇతర ముఖ్య నాయకులు, జడ్జిలు, మీడియా అధినేతల ఫోన్లు చేసినంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇచ్చారు. ట్యాప్ చేసిన జాబితాలో మహేశ్ కుమార్ పేరు కూడా ఉండటంతో ఆయన నుంచి సమాచారం కావాలని సిట్ అధికారులు కోరారు. దీంతో అధికారుల ఎదుట హాజరైన తన స్టేట్మెంట్ ఇచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. తాము మాత్రమే శాశ్వతంగా అధికారంలో ఉండాలనే దుర్మార్గమైన ఆలోచనలతో ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోవడానికి తమ నేతల ట్యాపింగ్ వల్లే అర్థమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తనతో సహా ముఖ్యమైన కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే ఫోన్లు ట్యాప్ అయినట్లు తాము ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా నిందితులకు కఠిన శిక్ష విధించాలన్నారు. అలాగే ఇందులో రాజకీయ నేతలకు తలొగ్గి సహకరిచిన అధికారులకు కూడా శిక్ష పడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలని మండిపడ్డారు.