Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: లక్షలు వెచ్చించి నిర్మించారు, ప్రారంభించక వదిలేశారు!

Mallapur: లక్షలు వెచ్చించి నిర్మించారు, ప్రారంభించక వదిలేశారు!

కొత్త స్కూల్ అందుబాటులోకి వచ్చేది ఎన్నడో

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో నిర్మించిన నూతన పాఠశాల భవనం ఏళ్ళు గడుస్తున్నా ప్రారంభానికి మాత్రం నోచుకోవట్లేదు. మాజీ ఎంపీ కవిత చేతుల మీదుగా 2014 సంవత్సరంలో 9 సంవత్సరాల క్రితం నూతన భవనం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. నిధుల లేమితో భవన నిర్మాణం పూర్తయ్యేందుకు చాలా సమయమే పట్టింది. ఎట్టకేలకు 2018 లో పూర్తయిన భవనం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవటం విశేషం. నూతన హంగులతో నిర్మించిన భవనం ప్రారంభించక వృథాగా ఉండిపోతోంది. లక్షలు పెట్టి కట్టించిన భవనం నిరుపయోగంగా ఇలా మిగిలిపోవటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

పాఠశాలలో మూత్రశాలలు లేక పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్న పాఠశాల బిచ్చగాళ్లకు సురక్షిత స్థావరంగా మారిపోయింది. గత కొంతకాలం కిందట పాఠశాల సమస్యలను ప్రజాప్రతినిధులకు తెలుపగా తొందర్లోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పి, తూతూ మంత్రంగా పనులు ప్రారంభించి బాత్రూంలకు గుంతలు తోడి అలానే వదిలేశారు.
కొన్ని కొన్ని గ్రామాల్లో పాఠశాలలు శిథిలా వ్యవస్థకు వచ్చినా వాటిని పట్టించుకునే వారు లేరు. ఇక్కడ నూతన భవనం నిర్మించినా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయులని సంప్రదించగా నూతనంగా నిర్మించిన పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవని, బాత్రూంలు లేకపోవడం, ప్రహరీ గోడ లేకపోవడం వల్ల రోడ్డు పక్కన పాఠశాల ఉండటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు కలుగుతాయని పాఠశాల సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రహరీ గోడ, బాత్రూంల నిర్మాణం పూర్తయ్యాక నూతన భవనంలో క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పాఠశాల భవనంపై స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చొరవ చూపి.. తొందరగా పాఠశాల భవనం ప్రారంభించి అందులో విద్యార్థులకు పాఠాలు బోధించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News