ఉస్మానియా యూనివర్శిటీలో నిర్భంద ఆంక్షలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ(Maoist Party) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేటి పాలకుల కారణంగా ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదల చేసింది. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని మండిపడింది. ఓయూలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేయకూడని ఈ నెల 13న యూనివర్శిటీ రిజిస్ట్రార్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని శిక్షిస్తామని హెచ్చరించింది. ఓయూలో విధించిన నిర్బంధ ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ ఆంక్షలను ఎత్తివేసేంత వరకు విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది.
విద్యార్థుల పోరాటాలపై ఉక్కుపాదం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంతృత్వ విధానాలను అమలు చేస్తూ పౌరుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని విమర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు దేశాన్ని నాశనం చేసేలా ఉన్నాయని ధ్వజమెత్తింది. నిజాం మొదలు నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఓయూ విద్యార్థులు ఇప్పటికీ పోరాడుతున్నారని పేర్కొంది.తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్నారని గుర్తుచేసింది. నేటి దోపిడీ పాలక వర్గాలు నిరంకుశ బూర్జువా వర్గాల ప్రయోజనాలను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయని మండిపడింది.