పర్యావరణాన్ని పరిరక్షించుకొని… భవిష్యత్ ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రజలపై ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Surekha)తెలిపారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి గూగులోత్, పిసిబీ బోర్డు మెంబర్లు సత్యనారాయణ రెడ్డి, విజయలక్ష్మీ, జయదేవ్, పిసిబి ఉద్యోగులు, సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యావత్ ప్రపంచానికే సవాలుగా మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు సంయుక్త కృషి అవసరం ఆమె అభిప్రాయపడ్డారు. మనం అందరం కలిసి మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి… సంరక్షించుకోవాలనే బాధ్యతను ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
కాగా ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఉద్దేశించి విద్యార్థులు పలు అవగాహన సాoస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఈ సంవత్సరం “ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతం చేయడం”(Ending Plastic Pollution- Globally) అనే థీమ్ తో ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం 80 లక్షల నుంచి 120 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోందని… ఇది ప్రపంచ తీర ప్రాంతాలను అనేక వ్యర్థాలతో కప్పేసేంత ప్రమాదం ఉందన్నారు.
1972లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవం, 150కి పైగా దేశాలను ఒకే వేదిక కిందకి తీసుకువచ్చి, పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నదన్నారు. ఈ సంవత్సరం, ప్లాస్టిక్ కాలుష్యం అనే కీలక సమస్యపై దృష్టి సారించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సృష్టించేందుకు కట్టుబడి ఉందన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా… ఈ రోజు కొన్ని మంచి నిర్ణయాలతో ప్లాస్టిక్ నివారణలో ముందంజలో ఉంటామని మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నామని మంత్రి సురేఖ చెప్పారు. కాగా, 2018లో, భారతదేశం 2022 నాటికి సింగిల్-యూస్ ప్లాస్టిక్లను తొలగించాలని ప్రతిజ్ఞ చేసిందనీ మంత్రి సురేఖ వెల్లడించారు.