తెలంగాణ అసెంబ్లీలో(TG Assembley) విద్యాశాఖ పద్దుపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడం లేదని తెలిపారు. అయితే సబితా విమర్శలపై మంత్రి సీతక్క (Seethakka) ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తీరు ఆత్మ స్తుతి పరనింద అన్నట్లుగా ఉందని విమర్శించారు. అధికారంలో ఉన్నంత కాలం ఏనాడు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ గురించి ఆలోచించని బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేవలం ఎన్నికల షెడ్యూల్కు మూడు రోజుల ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ పథకాన్ని ప్రారంభించిందని మండిపడ్డారు.
పిడికెడు పాఠశాలల్లో ఈ పథకాన్ని ప్రారంభించి ప్రచారం చేసుకున్నారని దీని కోసం ఒక రూపాయి కూడా చెల్లించలేదన్నారు. రూ.3.50 కోట్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో విద్యాశాఖ దుస్థితి ఎలా ఉండేదో స్వయంగా కేసీఆర్(KCR) మనవడే ప్రపంచానికి చెప్పారని గుర్తుచేశారు. ముక్కు మూసుకుని గౌలిదొడ్డి పాఠశాలను సందర్శించి ఇలాంటి పాఠశాలలను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. పాఠశాలల సంఖ్యను పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న గత ప్రభుత్వం.. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయిందని సీతక్క కౌంటర్ ఇచ్చారు.