Wednesday, September 18, 2024
HomeతెలంగాణMinister Seethakka says government ready to solve Engineers problems: ఇంజినీర్ల సమస్యల...

Minister Seethakka says government ready to solve Engineers problems: ఇంజినీర్ల సమస్యల పరిష్కారానికి మేం రెడీ-మంత్రి సీతక్క

పంచాయత్ ఇంజినీర్లతో..

దేశ ప్రగతిలో ఇంజనీర్ల పాత్ర చాలా గొప్పదని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. ఆనకట్టలు, రహదారులు, వంతెనలు నిర్మించి దేశ ప్రగతిని పరుగులు పెట్టించారని తెలిపారు. తమ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఇంజనీర్లు పనిచేయాలని కోరారు. ఇంజనీర్లకు వాహన సదుపాయం, పెండింగ్లో ఉన్న డిఏ పి ఆర్ సి, పదోన్నతులు వంటి అంశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ లో పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేశ మొట్టమొదటి సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తిగా ఇంజనీర్ అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశ అభివృద్ధిలో ఇంజనీర్లు పోషించిన పాత్రను వివరించారు. ఎన్నో ఆనకట్టలకు కూలీలతోపాటు ఇంజనీర్లు కూడా రాళ్ళేతారని, వారి కృషి ఫలితంగానే ఆహార సంక్షోభం వంటి ఎన్నో సంక్షోభాలను ఈ దేశం అధిగమించగలిగిందని చెప్పారు. మరి ముఖ్యంగా సివిల్ ఇంజనీర్లు లేకపోతే మనదేశంలో ఈ స్థాయి అభివృద్ధి జరిగేది కాదని పేర్కొన్నారు.

- Advertisement -

నాణ్యత ప్రమాణాలను పెంచేలా ఇంజనీర్లు పనిచేయాలన్నారు. ఒకప్పుడు 20 ఏళ్ల పాటు భద్రంగా ఉండే సిసి రోడ్లు, ఇప్పుడు చిన్నపాటి వర్షానికే దెబ్బ తినటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణలో సివిల్ ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో కఠినంగా వ్యవహరించాలని కోరారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని చెప్పారు. వర్షాలు వరదల నేపథ్యంలో దెబ్బతిన్న రహదారులను మెరుగుపరిచే విషయంలో ఇంజనీర్లంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రోడ్ల మరమత్తుల కోసం అవసరం అయితే అధిక సమయాన్ని కేటాయించేందుకు కూడా సిద్ధపడాలని పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని గ్రామాల్లో రహదారి, రవాణా సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వృత్తికి వన్నె తెచ్చేవారినే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని, అందుకే సుప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటామని పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తిగా ఇంజనీర్లు అంతా జాతి నిర్మానానికి పునర్కితం కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ కనక రత్నం, ఇతర ఉన్నతాధికారులు, పంచాయతీ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News