కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ(Priaynaka Gandhi)పై బీజేపీ నేత రమేష్ బిధూరి(Ramesh Bidhuri) చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికే అవమానకరమని మండిపడ్డారు. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిధూరిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేతలకు టికెట్లు ఇస్తే మహిళలు స్వేచ్చగా, నిర్బయంగా తిరగగలరా..? అని నిలదీశారు. మహిళా వ్యతిరేకతను బీజేపీ అణువణువునా నింపుకుందన్నారు. అందుకే రమేష్ బిధూరిని బీజేపీ వెనకేసుకొస్తుందని ఆమె విమర్శించారు.
ఒక మహిళ శరీరాన్ని రోడ్లతో పోల్చి తన దుర్బుద్ధిని, పురుష దురంకారాన్ని బీజేపీ బయటపెట్టుకుందని ఫైర్ అయ్యారు. తన వికృత చేష్టలతో ఆడవాళ్లను బీజేపీ అవమాన పరుస్తోందని..బీజేపీకి మహిళలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని అవలంబించడమే బీజేపీ మూల సిద్ధాంతమని.. ఆ శాస్త్రంలో మహిళలను గౌరవించిన చరిత్ర లేదన్నారు. మహిళలను గౌరవించడం బీజేపీకి తెలియదని సీతక్క ధ్వజమెత్తారు. కాగా ఢిల్లీలోని కల్కాజీ రోడ్లను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ బుగ్గల మాదిరి నిర్మిస్తానంటూ రమేష్ బిధూరి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.