Monday, September 30, 2024
Homeతెలంగాణసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన రెండవ రోజు

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన రెండవ రోజు

వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలి

తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు అమెరికా పర్యటనలో ఉన్న వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలని, ఉన్నత చదువులు చదివి అమెరికాలో అత్యంత అధునాతన వేల ఎకరాల లాంగ్ వ్యూ ఫార్మ్  వ్యవసాయ క్షేత్రం నిర్వహిస్తున్న ప్రస్తుత యజమానులు అభినందనీయులన్నారు మంత్రి. అమెరికాలోని అత్యంత అధునాతన వ్యవసాయ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన లాంగ్ వ్యూ ఫార్మ్ లో మంత్రి అధికారికంగా పర్యటించారు. 1950 ల్లో కెన్నెత్-లూయిస్ అనే జంట మొదలుపెట్టిన ఈ వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు వారి మునిమనవలైన నాలుగో తరం వారు నడిపిస్తుండటం విశేషమన్నారు. అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నమని, ఇక్కడ భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమయిందని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -

ఇక్కడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా మనదేశానికి భిన్నంగా ఉన్నాయన్న మంత్రి ఇక్కడి రైతులు కొంత కార్పొరేటీకరణ వల్ల ప్రభుత్వం మీద పెద్దగా అధారపడటం లేదని మా అధ్యయనంలో అర్ధమయిందంటూ చెప్పుకొచ్చారు.  తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి భారీ యంత్రాల వినియోగం వ్యక్తిగత స్థాయిలో సాధ్యపడదని .. అందుకే రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితం అయ్యి యాంత్రీకరణ ఫలాలు అందుకోవాలన్నారు. సహకార వ్యవస్థ బలోపేతం అయితేనే  భవిష్యత్ లో కార్పొరేట్లకు ధీటుగా నిలబడటం సాధ్యపడుతుందని, సహకార శక్తి సంఘటితం అయితే ఏ కార్పొరేట్ శక్తి కూడా దాని ముందు నిలవలేదన్నారు.  సహకార సంఘాలను విజయవంతంగా ఎలా నడపాలో మహారాష్ట్ర చక్కెర రైతుల అనుభవం నుండి, తెలంగాణ ముల్కనూరు సహకార సంఘాల నుండి నేర్చుకోవాలన్నారు. 

   అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజు అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ అనే భారీ వ్యవసాయ క్షేత్రం సందర్శన నూతన టెక్నాలజీ వినియోగంలో ఎంతో పురోగతి సాధించిన లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రం  జీపీఎస్ ద్వారా ఒక్క సెంటీమీటర్ తేడా లేకుండా విత్తడం, భారీ యంత్రాల సాయంతో దున్నడం నుండి పంట నూర్పిళ్ల వరకూ పనులు చేయడం, హెలికాప్టర్లు మరియు డ్రోన్ల ద్వారా క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్, మొక్క ఎదుగుదలను ప్రతి స్టేజిలో డేటా సేకరించి మానిటర్ చేయడం వంటి వాటిని పరిశీలించిన మంత్రి బృందం లాంగ్ వ్యూ ఫార్మ్  సందర్శించిన  బృందానికి  సీఈఓ స్టీవ్ హెన్రీ అన్ని వివరాలతో కూడిన ఒక ప్రెజెంటేషన్ చేశారు. భారీ వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించడంలో ఉండే సాధక బాధకాలను, తమ అనుభవాలను స్టీవ్ హెన్రీ పంచుకున్నారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా మొక్కజొన్న (కార్న్), సోయాబీన్ పండిస్తామని తెలిపారు. కేవలం ఆహార ధాన్యాలే కాకుండా,  మేలురకమైన విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తామని, ఆహార ధాన్యాలతో పోలిస్తే విత్తన ఉత్పత్తి వలన లాభాలు మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని, పశువులు, పందుల పెంపకం కూడా చేస్తున్నామని, భూసారాన్ని కాపాడుకోవడానికి, నెల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు.  

అనంతరం ఇల్లినాయిస్ రాష్ట్రంలోని డికెటర్ నగరంలో ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు హాజరై  ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఫార్మ్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ’ఫార్మ్ ప్రోగ్రెస్ షో’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులను, ప్రముఖ వ్యవసాయ కంపెనీలను, సంస్థలను అనుసంధానిస్తున్నది వందలాది ఎగ్జిబిటర్‌లతో, తాజా వ్యవసాయ ఉత్పత్తుల గురించి, సాంకేతికత గురించి,  సరికొత్త ఆవిష్కరణల గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి, ప్రపంచ స్థాయి వ్యవసాయ నిపుణులను, సంస్థల ప్రతినిధులను ప్రత్యక్షంగా కలవడానికి ఈ ‘ఫార్మ్ ప్రోగ్రెస్ షో’ ఉపయోగ పడుతున్నది.

ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, పశుసంపద, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సేంద్రీయ వ్యవసాయం, హార్టికల్చర్, వ్యవసాయ విద్య వంటి వ్యవసాయానికి సంబంధించిన వివిధ రంగాలకు చెందిన స్టాల్స్‌ పరిశీలన విత్తనాలు, యంత్రాలు తయారుచేసే ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ఆధునిక సాంకేతికత గురించి తెలుసుకున్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News