ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
“పార్టీలో నాకు నీతులు చెప్పే నాయకులు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలపై మాత్రం దృష్టి పెట్టకుండా నిస్సహాయంగా ఉన్నారు. కేసీఆర్కు నేను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో అడిగితే, కొందరు నా మీద పెయిడ్ సోషల్ మీడియాతో దాడి చేస్తున్నారు. ఇంటి ఆడబిడ్డపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి నాపై పోరాడుతామంటే ఎలా? దొంగల్ని పట్టుకోమంటే చేతగాక నాపై ప్రతాపం చూపితే ఎలా?
కేసీఆర్కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు. సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారు. అదే జిల్లాలో ప్రొటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా నాపై ప్రతాపం చూపుతున్నారు.
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించాను. నాపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదు. కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. పార్టీలో కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు.. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాను. నేను ఏనాడూ పదవుల కోసం పోరాడలేదు. కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశాను. నన్ను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన తప్ప.. చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి?
కేవలం “ట్విట్టర్లో పోస్టులు పెడితే పార్టీ నడవదు”. కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాలో సంబరాలు అవసరమా?(కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు) అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో అధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని కవిత తాజాగా వ్యాఖ్యల ద్వారా క్లారిటీ వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.