బీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరో నాయకత్వాన్ని తాను ఒప్పుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) కుండబద్దలు కొట్టారు. తనకంటూ ప్రత్యేక జెండా.. అజెండా ఏమీ లేవని.. పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన అజెండా అని చెప్పారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లో కవిత పర్యటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు.
పార్టీలో చోటుచేసుకుంటున్న సమస్యలతో పాటు కోవర్టులపై అధినేతకు లేఖ రాస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఎన్నో ఆవేదనలు భరించలేక లేఖ రాశానని స్పష్టం చేశారు. తన లేఖ ఎలా బయటకు వచ్చిందో.. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తేలాల్సిందేన్నారు. బీజేపీతో పొత్తు వద్దనేదే తన తాపత్రయమని తెలిపారు. ఆ పార్టీతో కలిస్తే భవిష్యత్ లేదని వ్యాఖ్యానించారు. జైలులో ఉన్నప్పుడే విలీనం ప్రతిపాదనను వ్యతిరేకించానని కవిత వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాను నిర్దోషినని.. కోర్టు కూడా అదే చెప్పిందన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలవడమంటే లిక్కర్ కేసులో నేరాన్ని అంగీకరించినట్లు అవుతుందన్నారు.