Weather Forecast Update: బంగాళాఖాతం తీరంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో గత వారం రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్లో ఉదయం వేళ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే సాయంత్రం వేళ మాత్రం అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుంచి ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
నేడు వర్షాలు కురిసే ప్రాంతాలు: నేడు భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also read:https://teluguprabha.net/telangana-news/moderate-rains-forecast-for-telangana-and-ap/
హైదరాబాద్ రహదారులు జలమయం: హైదరాబాద్లో ఒక్కసారిగా ఉన్నట్లుండీ.. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండతో ఉక్కపోత ఉండగా.. సాయంత్రం వేళలో భారీ వర్షం కురుస్తుంది. బుధవారం సాయంత్రం కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో నగర రహదారులు జలమయం అయ్యాయి. నిన్న రాత్రి 9 గంటల వరకు నగరంలోని బేగంపేటలో 3.25 సెం.మీలు, బహుదూర్పురాలోని సులేమాన్నగర్లో 3.0సెం.మీలు, ఆసిఫ్నగర్లో 2.45 సెం.మీలు, బోయిన్పల్లి, హయత్నగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో సెంటిమీటర్కు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వాహనదారులు తెగ ఇబ్బందికి గురైయ్యారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో నగర వాసులు నరకం చూస్తున్నారు. అయితే ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పిడుగుల హెచ్చరిక: ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.


