Friday, September 20, 2024
HomeతెలంగాణMukhara village: సిఎం సార్ నామినేషన్ కు పింఛనుదార్ల ఆసరా

Mukhara village: సిఎం సార్ నామినేషన్ కు పింఛనుదార్ల ఆసరా

ముఖరం గ్రామస్థులు చాలా గొప్పవాళ్లన్న సీఎం

సిఎం కేసీఆర్ నామినేషన్ ఖర్చులకు ఆసరాగా నిలిచారు ముఖరా (కె) గ్రామ పింఛన్ దారులు. విధి వంచితులైన తమ జీవితాల్లో వెలుగులు నింపి, ఆర్థిక భరోసాను, ఆత్మగౌరవాన్ని పెంచిన బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పట్ల ముఖరా కే గ్రామ పింఛనుదారులు ప్రేమాభిమానాలను, కృతజ్జత చాటుకున్నారు. తమకు నెల నెలా టంచనుగా అందుతున్న ఆసరా పింఛనులోంచి పొదుపు చేసుకున్న వెయ్యి రూపాయలను సిఎం కేసీఆర్, మంత్రి కెటిఆర్ నామినేషన్ ఖర్చులకోసం ఉడతాభక్తి సాయంగా ఆసరా’ గా నిలవాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -

అదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలానికి చెందిన ముఖరా కే గ్రామం పలు రంగాల్లో ప్రతిభను చాటుకుంటూ దేశవ్యాప్త గుర్తింపుతో జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటూ ఇప్పటికే ఆదర్శగ్రామం గా నిలిచింది. ఈ గ్రామంలోని ఆసరా పించనుదారుల నిర్ణయంతో మరోసారి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామంలో వందమంది పింఛను పొందుతున్నారు. వారిలో వృద్ధులు వంటరి మహిళలు వికలాంగులు వితంతు మహిళలు తదితరులున్నారు. వారందరూ తమ సర్పంచ్ గాడ్గె మీనాక్షిని కలిసి తలా వేయి రూపాయల చొప్పున లక్ష రూపాయల నగదును తెచ్చి సర్పంచ్ చేతిలో పెట్టారు. తమను కంటికి రెప్పోలె చూసుకుంటూ తమ జీవితాలకు సామాజిక ఆర్థిక భరోసాను అందించిన సిఎం కేసీఆర్ కు తమ పేరుమీద నామినేషన్ ఖర్చులకోసం లక్ష రూపాయలు ఇచ్చిరావాలని సర్పంచిని కోరారు. తమ గ్రామస్థుల ఔదార్యాన్ని సిఎం కేసీఆర్ మీదున్న ప్రేమను లక్ష రూపాయల రూపంలో మూటగట్టుకుని ముఖ్యమంత్రిని కలిసేందుకు, ఎంపీ సంతోష్ కుమార్ సహకారంతో, ప్రగతి భవన్ కు చేరుకున్న గాడ్గె మీనాక్షి సిఎం కేసీఆర్ ను కలిసి తమ గ్రామస్థుల విజ్జప్తిని వినిపించారు.


ముఖరా కే గ్రామ ఆసరా పింఛనుదార్ల ప్రేమాభిమానాలకు ముగ్దుడైన సిఎం కేసీఆర్ వారు పంపిన చందాను కృతజ్జతాపూర్వకంగా స్వీకరించారు. కాగా… తమ లక్షరూపాయల్లో సిఎం కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ నామినేషన్ ఖర్చుల కోసం చెరో 50 వేలను అందించాలనే వారి కోరిక మేరకు… సిఎం కేసీఆర్ పేరుమీద 50 వేలు…కేటీఆర్ పేరు మీద 50 వేలు చెక్కులను సర్పంచ్ గాడ్గె మీనాక్షి అంద జేశారు.
ఈ సందర్భంగా ముఖరా కే గ్రామస్తులకు సిఎం కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ కృతజ్జతలు తెలిపారు.

ముఖరా కే ప్రపంచానే ఆదర్శ గ్రామం.. ఆ గ్రామ ప్రజలు గొప్పవాళ్లు – సిఎం కేసీఆర్

ప్రభుత్వాలు నేతలనుంచి ఆసరా పొందే ప్రజలున్న పల్లెలను చూసాం గానీ, స్వయంగా గ్రామస్థులే తిరిగి సమాజానికి తిరిగి పంచుతున్న గొప్ప సందర్భాన్ని తెలంగాణలో మాత్రమే చూస్తున్నామని సిఎం హర్షం వ్యక్తం చేశారు. ముఖరా కే పించన్ దారులు తనకు నామినేషన్ ఖర్చుల కోసం ఆసరా’ సాయాన్ని అందించడం గొప్ప విషయమన్నారు.
ఇప్పటికే ముఖరా కే గ్రామస్థులు సిఎం రిలీఫ్ ఫండ్ కోసం లక్ష రూపాయలు ఇచ్చిన విషయాన్ని సిఎం కేసీఆర్ గుర్తు చేసుకుని అభినందించారు. తెలంగాణ పల్లెల్లో వెల్లివిరుస్తున్న చైతన్యానికి ముఖరా కే గ్రామం ప్రతీకగా నిలుస్తున్నదని సిఎం అన్నారు. ఈ గ్రామం దేశంలోని పల్లెలకే ఆదర్శమని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతమౌతున్నాయనడానికి ఈ గ్రామం దర్పణం పడుతున్నదని సిఎం అన్నారు. ఎక్కడ ఆకలి వుండదో ఎక్కడ కష్టాలు కన్నీల్లు వుండవో అక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ప్రేమాభిమానాలతో పరస్పర సహకార జీవన విధానంతో జీవిస్తారనేదానికి ముఖరా కే గ్రామమే నిదర్శనమన్నారు. ముఖరాకే ప్రపంచానికే ఆదర్శ గ్రామమని కొనియాడారు. తాను వీలు చేసుకుని తప్పకుండా ముఖరాకే వస్తానని వొక దినం మొత్తం మీ గ్రామంలోనే గడుపుతానని సిఎం సర్పంచ్ కి మాట ఇచ్చారు. తెలంగాణ పల్లెలిపుడు సుఖ సంతోషాలకు నిలయాలుగా మారాయని భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెంది దేశానికే సాయం చేసే స్థాయికి చేరుకుంటాయని సిఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, ముఖరా కే ఎంపీటీసి గాడ్గె సుభాష్, దీపక్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News