Sunday, September 8, 2024
HomeతెలంగాణSuper Luxury Buses : కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు వ‌చ్చేశాయ్‌.. ఏఏ స‌దుపాయాలున్నాయో తెలుసా?

Super Luxury Buses : కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు వ‌చ్చేశాయ్‌.. ఏఏ స‌దుపాయాలున్నాయో తెలుసా?

Super Luxury Buses : రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది టీఎస్ ఆర్టీసీ. ఈ క్ర‌మంలో ప్రయాణీకులకు వేగవంత‌మైన‌, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దృష్టిసారించింది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో యాజమాన్యం నూతన బస్సులను కొనుగోలు చేసింది.

- Advertisement -

ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డిలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. ఈ బస్సులన్నీ మార్చి, 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త‌ బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూంనకు అనుసంధానం చేయనున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూం నకు సమాచారం అందుతుంది.

ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్ సీట్లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తారు. ప్ర‌యాణీకుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్ డీఏఎస్) ఏర్పాటు చేయడం జ‌రిగింద‌ని ఆర్టీసీ యాజ‌మాన్యం తెలిపింది. అదేవిధంగా బ‌స్సులో మంటల చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేసేలా బ‌స్సులో ప‌రికాల‌ను అమర్చ‌నున్నారు. ఉష్ణోగ్రత పెరిగిన అలారం ఆటోమెటిక్గా మోగుతుంది. అగ్నిప్రమాదాలు జరిగితే ఎఫ్ డీఏఎస్ విధానం వల్ల వెంటనే చర్యలు తీసుకోవచ్చు. ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు. వీటిని శ‌నివారం మ‌ధ్యాహ్నం మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ప్రారంభించ‌నున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News