Saturday, November 15, 2025
HomeతెలంగాణCYBER CRIME ALERT: సైబర్ వలలో చిక్కితే.. సొమ్ము తిరిగి రానట్లే! నిజామాబాద్‌లో రికవరీ కేవలం...

CYBER CRIME ALERT: సైబర్ వలలో చిక్కితే.. సొమ్ము తిరిగి రానట్లే! నిజామాబాద్‌లో రికవరీ కేవలం 17 శాతమే!

Low cybercrime recovery rate : ఒక్క క్లిక్.. ఖాతా ఖాళీ! ఆశ చూపి.. నిలువునా దోపిడీ! సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పన్నాగంతో విరుచుకుపడుతున్నారు. ఈ మాయగాళ్ల వలలో చిక్కితే, కష్టపడి సంపాదించుకున్న సొమ్ము తిరిగి రావడం గగనమేనని నిజామాబాద్ జిల్లా గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. గత ఆరు నెలల్లో, బాధితులు కోల్పోయిన సొమ్ములో పోలీసులు కేవలం 17.72% మాత్రమే రికవరీ చేయగలిగారంటే, ఈ సైబర్ ఊబి ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయి…? ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే ప్రయోజనమేంటి..?

- Advertisement -

దిగ్భ్రాంతికరమైన గణాంకాలు : నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన సైబర్ నేరాల చిట్టా ఆందోళన కలిగిస్తోంది.

నమోదైన కేసులు: 33
బాధితులు కోల్పోయిన మొత్తం: రూ. 4.92 కోట్లు
రికవరీ అయిన మొత్తం: కేవలం రూ. 87 లక్షలు (17.72%)

ఈ గణాంకాలు, సైబర్ మోసానికి గురయ్యాక డబ్బును తిరిగి పొందడం ఎంత కష్టమో స్పష్టం చేస్తున్నాయి.

నేరగాళ్ల కొత్త ఎత్తుగడలు : సైబర్ నేరగాళ్లు అనేక రూపాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు: అధిక లాభాలు వస్తాయని ఆశచూపి, వాట్సాప్ గ్రూపులలో చేర్చుకుని, నకిలీ యాప్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టించి మోసం చేస్తున్నారు.

డిజిటల్ అరెస్ట్: పోలీసులు, ఈడీ, ఇన్‌కంట్యాక్స్ అధికారులమని బెదిరించి, వీడియో కాల్స్‌లో నిర్బంధించి, డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఏపీకే ఫైల్స్: తెలియని లింకులు పంపి, వాటిని క్లిక్ చేయగానే ఫోన్‌ను హ్యాక్ చేసి, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

గోల్డెన్ అవర్’.. ప్రాణ సంజీవని : సైబర్ మోసానికి గురైనప్పుడు, ఎంత వేగంగా స్పందిస్తే, డబ్బును తిరిగి పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

“మోసం జరిగిన గంటలోపు సమయాన్ని ‘గోల్డెన్ అవర్’ అంటాం. ఈ సమయంలో బాధితులు వెంటనే 1930 లేదా డయల్ 100కి ఫోన్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. ఎంత వేగంగా ఫిర్యాదు చేస్తే, నేరగాళ్ల ఖాతాలను స్తంభింపజేసి, డబ్బును రికవరీ చేయడానికి అంతగా ఆస్కారం ఉంటుంది.”
– సాయిచైతన్య, పోలీస్ కమిషనర్, నిజామాబాద్

వెంటనే స్పందించడం వల్లే, ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో రూ.10.5 లక్షలు కోల్పోయిన వ్యక్తికి రూ.7.89 లక్షలు, డిజిటల్ అరెస్ట్ కేసులో రూ.30.81 లక్షలు పోగొట్టుకున్న మరో వ్యక్తికి రూ.20.81 లక్షలను పోలీసులు రికవరీ చేయగలిగారు.

తెలియని లింకులను క్లిక్ చేయవద్దని, అధిక లాభాల ఆశలకు పోవద్దని, ఎవరైనా అధికారులమని బెదిరిస్తే భయపడకుండా, వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అప్రమత్తతే సైబర్ నేరాల నుంచి మనకు శ్రీరామరక్ష.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad