Passengers Agitation At Shamshabad Airport: దేశరాజధాని ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా పలు ఎయిర్ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ముఖ్యంగా శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాల్లో ఆలస్యం ఏర్పడుతుంది. ఢిల్లీ ఎయిర్పోర్టులో సాంకేతికలోపం తలెత్తడంతో విమాన సర్వీస్లు నిలిచిపోయాయి. అలాగే చెన్నై నుంచి శంషాబాద్ రావాల్సిన రెండు విమానాలు ఆలస్యం అయ్యాయి. విమాన సర్వీస్ల ఆలస్యంతో ఎయిర్పోర్టులో ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఏటీసీ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా 350కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల ఆలస్యంతో ఢిల్లీ ఎయిర్పోర్టులో రద్దీ పెరిగింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన విమానాలన్నీ రద్దు చేశారు. ముంబై ఎయిర్పోర్టులోనూ ఏటీసీ వ్యవస్థ కుప్పకూలింది. ముంబై ఎయిర్పోర్టులో ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు. కాగా, ఈ విషయమై కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్పోర్టుల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. ఏటీసీలో సాంకేతికలోపం వల్లే అంతరాయం ఏర్పడిందన్నారు. సాంకేతిక సమస్య వెనుక హ్యాకర్లు, బయటివ్యక్తుల ప్రమేయం లేదన్నారు. అయినా, లోతైన దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సకాలంలో విమానాలు నడిచేలా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వెళ్లాల్సిన విమానాల ఆలస్యంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. సాంకేతిక సమస్యల కారణంగా శంషాబాద్ నుంచి వియత్నం బయలుదేరాల్సిన విమానం రన్వే పైనే నిలిపివేశారు. టేకాఫ్ అవ్వకుండా.. కొన్ని గంటల పాటు ప్రయాణికులతో అలానే ఉండిపోవడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ప్రయాణికులు వియత్నం ఎయిర్బస్సు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు శంషాబాద్ నుంచి వియత్నం వెళ్లాల్సిన విమానం నేడు (శనివారం) నాటికీ టేకాఫ్ అవ్వలేదు. దీంతో, 24 గంటలకు పైగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికులకు బస సౌకర్యం కూడా కల్పించలేదని, విమాన సంస్థ, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమాన సమయాలపై ఎయిర్పోర్ట్ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు వారితో గొడవ పడ్డారు. మరోవైపు, విమానం ఎప్పుడు టేకాఫ్ అయితుందో కూడా సిబ్బంది చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడడంతో ఎయిర్లైన్ సిబ్బందిపై మండిపడుతున్నారు. మరోవైపు వీకెండ్ కావడంతో.. విమానాశ్రయం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో విమానంలో 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాశారు. సాంకేతిక కారణాలతో ఢిల్లీ ఎయిర్పోర్టుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.


