Phone Tapping Case update: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల మరిన్ని ఆధారాలు సంపాందించారు. 2018 ఎన్నికల సమయంలోనే ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. ఎన్నికల సమయం కావడంతో ప్రత్యర్థి పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ప్రణీత్ రావు ద్వారా మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుకు ట్యాపింగ్ సమాచారం చేరేదని గుర్తించారు.
ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాలతో టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగేవి. ఈ సమాచారం ఆధారంగానే హైదరాబాద్ బేగంపేటలోని ప్యారడైజ్ వద్ద భవ్య ఆనంద్ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన రూ.70 లక్షల నగదును టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. అలాగే దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు.
ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్రావు బంధువులకు చెందిన కోటి రూపాయల నగదును కూడా ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగానే సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ రాధాకిషన్రావు, ఆయన బృందం ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం.
మరోవైపు ఈ కేసులో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావులను సిట్ అధికారులు విచారణకు పిలిచి వారి వాంగ్మూలం రికార్డ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు నేతృత్వంలోని ఎస్ఐబీ బృందం సుమారు 618 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయడం కోసం రివ్యూ కమిటీకి సమర్పించింది. ఆ సమయంలో సీఎస్గా ఉన్న శాంతి కుమారి డీఓటీకి ఆ లిస్ట్ పంపి టెలికం అనుమతులు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
ఇక ఈ కేసుకు సంబంధించి తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు నోటీసు పంపించారు. రేపు ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇవ్వనున్నారు.