Saturday, November 15, 2025
HomeతెలంగాణTG Local Elections: ఏదేమైనా ఈసారి ఎన్నికలకు వెళ్లాల్సిందే.. పంచాయతీ ఎన్నికలపై సర్కార్ ప్లాన్-బీ సిద్ధం..!

TG Local Elections: ఏదేమైనా ఈసారి ఎన్నికలకు వెళ్లాల్సిందే.. పంచాయతీ ఎన్నికలపై సర్కార్ ప్లాన్-బీ సిద్ధం..!

Plan B for TG Local Body Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా? జరగవా? అనే అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఓ వైపు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డుమెంబర్ల రిజర్వేషన్లను ఖరారు చేసింది. ముందునుంచి చెబుతున్నట్లుగానే బీసీలకు 42 శాతం సీట్లను కేటాయించింది. అయితే, ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో, అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నెల 6న సుప్రీంకోర్టులో, 8న హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. దీంతో న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న అంశంపై ఆశావహులతో పాటు ప్రధాన పార్టీల్లో ఆందోళన నెలకొంది. 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ప్రచారం ప్రారంభించి ముందుకు వెళ్లాలా? లేక న్యాయస్థానం నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలా? అన్న చర్చ వారిలో సాగుతోంది.

- Advertisement -

ప్లాన్‌ బీ సిద్ధం చేసిన సర్కారు..

ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా ప్లాన్-బీని సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు ఆగకుండా ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయస్థానం ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేస్తే వెంటనే పాత రిజర్వేషన్ల ముందుకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. గత ప్రభుత్వం బీసీలకు 23 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను కోర్టు కొట్టివేస్తే వెంటనే అధికారులు పాత పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ముందుకు వెళ్లనున్నారు. అంటే, బీసీలకు 42 శాతానికి పెంచిన రిజర్వేషన్లను తగ్గిస్తూ మార్పులు చేయనున్నారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ స్థానాలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఎలాంటి మార్పులు ఉండవని చెబుతున్నారు. కేవలం బీసీ రిజర్వ్ అయిన స్థానాలే ఇప్పుడు జనరల్‌కు మారుతాయని, అందులో కూడా మహిళా రిజర్వేషన్లు మారవని అంటున్నారు. దీంతో ఎవరైనా రిజర్వ్ అయిన స్థానం నుంచి బీసీ అభ్యర్థి పోటీకి సిద్ధం అయితే, ఒకవేళ రిజర్వేషన్లు మారినా ఎలాగూ జనరల్ అవుతుంది కాబట్టి బీసీలకు జనరల్‌ స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

పార్టీ పరంగా ఇచ్చే యోచనలో కాంగ్రెస్..

ఒక వేళ, బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టులు అంగీకరించకపోతే పార్టీ పరంగా అవకాశం ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఇతర పార్టీలు కూడా బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేయనుంది. తద్వారా బీసీల రిజర్వేషన్ పెంపుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేదే ఆ పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది.

నెల రోజులు ఆగి ఎన్నికలకు వెళ్దామా?

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించి అమలు చేసేలా ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీ ఆమోదించిగా.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఈ బిల్లుపై గవర్నర్ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. ఈ అంశాన్ని ఇటీవల హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లుకు జీవో ఎలా తీసుకువస్తారని అడిగింది. అయితే, గవర్నర్లు తమ వద్దకు రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన బిల్లులపై 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ వారు ఈ గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగానే భావించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంచాయతీ రాజ్ బిల్లును పంపి ఇప్పటికే 65 రోజులు పూర్తయ్యింది. మరో 25 రోజులు అయితే సుప్రీంకోర్టు చెప్పిన గడువు పూర్తి అవుతుంది. అప్పటిలోగా గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే చట్టం డీఫాల్ట్‌గా చట్టం అమల్లోకి వస్తుందని.. అప్పుడు ఎన్నికలకు వెళ్లడం సులభం అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు జీవోను కొట్టివేస్తే, ఆ ఆప్షన్‌ను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad