ప్రతి ఏడాది స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ పోలీసు పతకాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాల(Police Medals)ను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 942 మందికి అవార్డులను వెల్లడించింది. ఇందులో 95 మందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 101 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 746 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలను ప్రకటించింది.
ఇక ఈ అవార్డుల్లో తెలంగాణ నుంచి 12 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. అంతేకాకుండా తెలంగాణ నుంచి పోలీసు కమిషనర్ విక్రమ్సింగ్ మన్, ఎస్పీ మెట్టు మాణిక్రాజ్ రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలకు ఎంపికయ్యారు. అలాగే ఏపీ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జునరావు, వార్డర్ ఉండ్రాజవరపు వీరవెంకట సత్యనారాయణకు పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.