Local Body Elections: తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు పూర్తి కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మంత్రివర్గ విస్తరణ, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను పూర్తి చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇప్పుడు ఈ అంశాలు పూర్తి కావడంతో ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతోంది.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. జూన్ నెలాఖరున ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని వెల్లడించారు. దీంతో ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మెజార్టీ స్థానాల్లో గెలిచి గ్రామాల్లో, పట్ణణాల్లో తమ పట్టు నిలుపుకోవాలని హస్తం పార్టీ నాయకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే గ్రామాలు, పంచాయతీల్లో వార్డుల విభజన, ఓటర్ల జాబితాను ఇప్పటికే అధికారులు రెడీ చేశారు. రిజర్వేషన్లు సైతం ఖరారు చేసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో రానున్న రెండు నెలల పాటు రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొననుంది.