టీజీఆర్టీసీ సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కీలక సూచన చేశారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకందామని.. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పలువురు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పొన్నంను కలిసి తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వినడానికి ముఖ్యమంత్రితో పాటు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని వివరించారు.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి కోలుకుంటోందని, సమస్యలు తగ్గుతున్నాయని తెలిపారు. ఈ దశలో సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని సంస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఒక్క కొత్త బస్సు కొనలేదని, ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఉద్యోగులకు చెందిన సీసీఎస్, పీఎఫ్ నిధులను కూడా వాడుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఉద్యోగులకు బాండ్ రూపంలో రూ.400 కోట్లు, పీఎఫ్ బకాయిలు రూ.1,039 కోట్లు, సీసీఎస్ బకాయిలు రూ.345 కోట్లు చెల్లించామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సహకరించాలని ఆయన కోరారు.