Ponnam Prabhakar: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి రూపాయి బిల్లు తీసుకుని వారు కూడా తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వైఫల్యాలు సంగతి ఏంటని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ దేశ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను విస్మరించలేదా అని నిలదీశారు.
వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప బీజేపీ చేసిందేమి లేదని ఆరోపించారు. రైతులు, యువకులు, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను వంచించిన చరిత్ర బీజేపీ నేతలదని ఆగ్రహించారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు ఏడాదికి ఇచ్చే రూ.6 వేల కిసాన్ సమ్మాన్ నిధి పెంచుతామని ప్రగల్భాలు పలికిన విషయం మర్చిపోయారా అని నిలదీశారు. గత 11 ఏళ్లలో తెలంగాణకు ఒక్క రూపాయి కేంద్ర నుంచి రావడం లేదన్నారు. అన్ని వర్గాలను వంచించిన చరిత్ర మీదని పేర్కొన్నారు. మీ వైఫల్యాలు రాస్తే రామయణమంత, వింటే భారతమంత అని ఎద్దేవా చేశారు. అలాంటి మీరు తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని సెటైర్లు వేశారు.
లీటర్ పెట్రోల్ ధరను రూ.70 నుంచి రూ. 110కి పెంచింది మీరు కాదా..? అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో ధరల పెరుగుదలపై మొసలి కన్నీరు కార్చిన మీరు అధికారంలోకి వచ్చి ధరలను అమాంతం ఎందుకు పెంచారు? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి రూ.15 లక్షలు పంచుతామని.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఓట్లేయించుకుని మోసం చేసింది మీరు కాదా అని నిలదీశారు. రైలు టికెట్ల ధరలు పెంచిది మీరు కాదా? దేశంలో లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది మీరు కాదా? పీఎం ఫసల్ బీమా పథకంలో కేంద్ర వాటా తగ్గించి రైతులకు భారంగా మార్చింది మీరు కాదా? అని ఫైర్ అయ్యారు. 2022 లోపు అందరికి ఇళ్లు, టాయిలెట్లు, నల్లా కనెక్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,100 చేసి నిరుపేదల నడ్డి విరిచారని పొన్నం దుయ్యబట్టారు.
Also Read: Seethakka: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్
విద్వేశ ప్రచారం, విధ్వంస చర్యలు, రాజకీయ నియంతృత్వం, ఆర్థిక వ్యవస్థలో కార్పోరేట్ల పెత్తనం, మత ఆధిపత్యం, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోడీ హయంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వకుండా మోసం చేశారని, కృష్ణా జలాల్లో నీటి వాట తెల్చకుండా నాన్చుతుంది మీరు కాదా అని ప్రశ్నించారు. పోలవరం ముంపుతో సంబంధం లేని ఐదు పంచాయతీలను ఏపీలో విలీనం చేసి భద్రాద్రి రామయ్య భూములను ఏపీకి అప్పనంగా అప్పగించింది మీరు కదా? కోట్ల రూపాయల ఖర్చుతో రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నాం అని గొప్పలు చెప్పే మీకు.. భద్రాద్రి రాముడికి 17 కిలోమీటర్ల దూరంలోని పాండురంగాపురం స్టేషన్ కనపడదా? అని ప్రశ్నించారు.
గంగా ప్రక్షాళన కోసం గత ఎనిమిదేళ్లలో రూ.10,792 కోట్లు మంజూరు చేసిన మోడీ సర్కార్.. మూసీ ప్రక్షాళన కోసం ఒక్క రూపాయి మంజూరు చేయకున్నా మాట్లాడకుండా మూతీ మూడుచుకుంది మీరు కాదా? అని ధ్వజమెత్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలను వంచించి ఇప్పుడు ఒట్టి లేఖలు రాస్తే ప్రయోజనం లేదని సూచించారు. చేతనైతే ప్రధాని మోడీకి లేఖ రాసి ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చాలని రామచందర్ రావును డిమాండ్ చేశారు. అంతేకానీ ఏడాదిన్నర క్రితమే ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం అన్ని హామీలు ఎందుకు నెరవేర్చలేదంటూ లేఖలు రాయడం మీ గుడ్డి ద్వేషానికి అద్దం పడుతోందని పొన్నం ఘాటు విమర్శలు చేశారు.