Private Colleges Bandh Due to Fee Reimbursement: రాష్ట్రంలో రేపటి (నవంబర్ 3) నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కళాశాలలు సోమవారం నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు రేపటి నుంచి దశల వారీగా ఉద్యమాలు చేపట్టాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/fee-reimbursement-private-colleges-bandh-from-november-3rd/
2024- 25 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్లో విద్యాసంస్థలు నిరసనలు చేపట్టాయి. అయితే ఈ మొత్తంలో రూ. 1200 కోట్లు రెండు విడతల్లో ఇస్తామని దసరా సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక మిగతా రూ. 7,200 కోట్లను కూడా మార్చి 2026 నాటికి చెల్లించేలా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు హామీ ఇచ్చింది.
మొదటి విడతలో కేవలం రూ. 300 కోట్లు మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. మిగిలిన రూ. 900 కోట్లను దీపావళి నాటికి చెల్లించాల్సి ఉంది. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి సమాఖ్య విజ్ఞప్తి చేసింది. నవంబర్ 1 కి డెడ్లైన్ విధించింది. ఈ రోజు సానుకూల నిర్ణయం తీసుకుంటే బంద్ నిర్ణయాన్ని విరమించుకుంటామని తెలిపింది. అయితే నేడు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో చర్చించిన యాజమాన్యాలు రేపటి నుంచి నిరవధిక బంద్ చేపట్టాలని నిర్ణయించాయి.
ఇందులో భాగంగా ఈ నెల 6న లక్ష మంది సిబ్బందితో సభ, 10 వ తేదీన పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్, ‘చలో సెక్రటేరియట్’ వంటి కార్యక్రమాలకు సిద్ధమైనట్లు యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈ నెల 4 న మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తామని తెలిపాయి.


