promotions in Medical and health department: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే వైద్య విధాన పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను యుద్ధ ప్రాతిపదికపై భర్తీ చేయనున్నట్టుగా పేర్కొంది. అంతే కాకుండా భర్తీకి సంబంధించిన అనుమతులను సైతం మంజూరు చేసింది. అయితే నేడు మరో కీలక నిర్ణయాన్ని రేవంత్ సర్కార్ తీసుకుంది.
భారీగా ప్రమోషన్లు: రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ సేవలు మెరుగుపరచడం, ప్రభుత్వం నడిపే ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చడమే తమ లక్ష్యమని వైద్య, ఆరోగ్య రంగానికి చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. అయినప్పటికీ గత కొంతకాలంగా వైద్య, ఆరోగ్య శాఖలో పదోన్నతుల అంశం పెండింగ్లో ఉంటూ వస్తుంది. ఇదే విషయాన్ని ఉద్యోగులు ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డితో చర్చించి పదోన్నతులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించారు. వారిలో కృష్ణవేణి, శ్వేత, మంజునాథ్ నాయక్లు ఉన్నారు. అదేవిధంగా మరో 36 మంది సివిల్ సర్జన్లకు సైతం ప్రమోషన్లు ఇస్తూ సంబంధిత శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం కానుందని .. అధికార పార్టీ నేతలు తెలిపారు.



