Saturday, November 15, 2025
HomeతెలంగాణPublic Transport : నిమిషం ఆత్రం.. జీవితాంతం గాయం! ప్రజా రవాణాలో ప్రాణాలతో చెలగాటం...

Public Transport : నిమిషం ఆత్రం.. జీవితాంతం గాయం! ప్రజా రవాణాలో ప్రాణాలతో చెలగాటం వద్దు!

Safe public commuting practices : ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజా రవాణా మనకు ఓ వరం. కానీ, అదే వరం కొందరి అజాగ్రత్త, ఆత్రం కారణంగా శాపంగా మారుతోంది. బస్సు రాగానే ఒకరినొకరు తోసుకుంటూ, కదులుతున్న వాహనంలోనే ఎక్కేస్తూ, దిగిపోతూ ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ పెరగడంతో ఈ దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయి. అసలు మనకెందుకీంత ఆత్రం? నిమిషం ఆలస్యమైతే నష్టపోయేది ఏమిటి? మన ప్రాణాల కంటే సమయం అంత విలువైందా? చిన్నపాటి క్రమశిక్షణ, ఒకరికొకరు సహకరించుకోవడం అనే కనీస బాధ్యతను మనం ఎందుకు మరిచిపోతున్నాం? ఈ ప్రమాదకర ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే జరిగే అనర్థాలకు బాధ్యులెవరు?

- Advertisement -

“క్యూ పద్ధతి పాటించండి, మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోండి” అని అధికారులు, సిబ్బంది మొత్తుకుంటున్నా ప్రయాణికుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఫలితంగా బస్సులు, మెట్రో స్టేషన్లలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కేవలం చిన్నపాటి నిర్లక్ష్యం, నిబంధనలను పెడచెవిన పెట్టడమే ఈ అనర్థాలకు ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అజాగ్రత్తే ప్రమాదాలకు అసలు కారణం : రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక, ముఖ్యంగా మహిళలు సీట్ల కోసం పడే ఆరాటంలో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
తోపులాటలు: బస్సు ఆగగానే ఒక్కసారిగా ఎగబడటం, ఒకరినొకరు తోసుకోవడంతో వృద్ధులు, పిల్లలు కిందపడి గాయపడుతున్నారు.
కదులుతున్న బస్సుతో పరుగు: వాహనం పూర్తిగా ఆగకముందే పరిగెత్తుకెళ్లి ఎక్కడం, గమ్యం రాగానే పూర్తిగా ఆగకముందే దూకి దిగడం వంటి సాహసాలు ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి.
ఫుట్‌బోర్డు ప్రయాణం: బస్సులో చోటు లేకపోయినా ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణించడం అత్యంత ప్రమాదకరం. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు పట్టుతప్పి కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఫోన్‌తో పరధ్యానం: సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సు ఎక్కడం, దిగడం వల్ల దృష్టిమరలి ప్రమాదాలకు గురవుతున్నారు.

నిపుణుల మాట.. నిబంధనలే మనకు కోట : ప్రమాదాలను నివారించడానికి రాకెట్ సైన్స్ అవసరం లేదు, కనీస క్రమశిక్షణ పాటిస్తే చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా కొన్ని నియమాలు పాటిస్తే ప్రయాణం సుఖమవడమే కాకుండా, సురక్షితంగా గమ్యం చేరవచ్చు.

వరుస క్రమమే రక్ష: బస్సు, రైలు, మెట్రో ఏదైనా సరే, క్యూ పద్ధతి పాటించడం ప్రాథమిక కర్తవ్యం. దీనివల్ల తోపులాటలకు ఆస్కారం ఉండదు.
ఓపికే ప్రాణ రక్ష: వాహనం పూర్తిగా ఆగిన తర్వాతే ప్రశాంతంగా ఎక్కాలి, దిగాలి.
ఇతరులకు గౌరవం: వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వడం మన సంస్కారం.

ప్రయాణంలో సంయమనం: ఫుట్‌బోర్డు ప్రయాణం చేయకపోవడం, సెల్‌ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకపోవడం, పెద్ద శబ్దంతో పాటలు వినకపోవడం తోటి ప్రయాణికులకు మనం ఇచ్చే గౌరవం.

విదేశాల్లో క్రమశిక్షణ.. మనం నేర్చుకోవాలి : ప్రజా రవాణాలో క్రమశిక్షణకు అభివృద్ధి చెందిన దేశాలు పెట్టింది పేరు. వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
ఇంగ్లాండ్: బస్సు కోసం గంటల తరబడి అయినా ఓపిగ్గా క్యూలో నిలబడతారు. బస్సుల్లో తినడం, తాగడం నిషేధం.
జపాన్: ప్రజా రవాణాలో ఫోన్ కాల్స్ మాట్లాడటం చాలా అరుదు. మొబైల్‌ను ‘మానర్ మోడ్’లో ఉంచి, నిశ్శబ్దాన్ని పాటిస్తారు.
సింగపూర్: శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. బస్సుల్లో చూయింగ్ గమ్ నమలడం కూడా నిషేధం.
తైవాన్: వృద్ధులు, గర్భిణుల కోసం కేటాయించిన సీట్లలో అర్హులు లేకపోతే, ఆ సీట్లను ఖాళీగా వదిలేస్తారే తప్ప ఇతరులు కూర్చోరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad