Tuesday, June 17, 2025
HomeతెలంగాణR Narayana Murthy: ప్రశ్నిస్తే నక్సలైట్స్ అంటున్నారు.. నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

R Narayana Murthy: ప్రశ్నిస్తే నక్సలైట్స్ అంటున్నారు.. నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

R Narayana Murthy on Operation Kagar: పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ప్రజా సమస్యలపై తనదైన శైలిలో ఎన్నో సినిమాలు తీశారు. విప్లవ భావజాలం ఉన్న సినిమాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఆయన నటించి దర్శకత్వం వహించిన అనేక చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఎంత ఎత్తుకు దిగినా ఒదిగా ఉండటం నారాయరణమూర్తి ఫిలాసఫీ. అందుకే ఆయన సాధారణంగా ఉంటాయి. బాటా చెప్పులు వేసుకుని ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతూ సామాన్యుడిలా జీవిస్తారు. ఆయన నమ్మిన ఆ సిద్ధాంతం కోసమే నేటికీ కట్టుబడి ఉన్నారు. ఏదైనా సమస్యపై మాట్లాడేటప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడతారు. వేదికపై ఎవరున్నారనేది కూడా పట్టించుకోకుండా తాను అనుకున్నది చెప్పేస్తారు.

కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’పై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా అన్నలను పొట్టన పెట్టుకున్నారంటూ వాపోతున్నారు. తాజాగా ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతియుత చర్చలు ప్రారంభించాలని కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు, హక్కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యఅతిథిగా ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే వారిని నక్సలైట్లుగా ముద్ర వేయడం సరికాదని హితవు పలికారు. ప్రజాసమస్యలపై గళమెత్తితే వారిని నక్సలైట్లు అంటున్నారని.. మౌనంగా ఉండేవారినీ ఆల్ రైట్ అంటున్నారని మండిపడ్డారు. అడవులను అంబానీ, అదానీలకు కట్టబెట్టడానికి మావోయిస్టులను చంపేస్తున్నారని ఆరోపించారు. శత్రుదేశమైన పాకిస్థాన్‌తో చర్చలు జరిపి ఆపరేషన్ సిందూర్‌ని ఆపారని.. మరి అలాంటప్పుడు భరతమాత బిడ్డలైన నక్సలైట్‌‌లతో ఎందుకు చర్చలు జరపకుండా దారుణంగా చంపుతున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టు నేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఇక ఈ నిరసనలో పాల్గొన్న తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని తెలిపారు. అడవుల నుంచి ఆదివాసీలను తరిమివేసి అటవీ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే కేంద్రం చూస్తుందన్నారు. అందుకే మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపణలు చేశారు. ఆదివాసీల జీవితాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను తక్షణమే ఆపాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News