తెలంగాణలో బీజేపీ ఒంటరిగా ఎదుగుతుందని.. వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) వ్యాఖ్యలు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం అని మండిపడ్డారు. కవితకు దమ్ము ఉంటే చిట్చాట్లు చేయడం కాదు.. మీడియాతో నేరుగా వచ్చి మాట్లాడాలని హితవు పలికారు. మీ సొంత పంచాయితీలు మీరే తేల్చుకోండన్నారు. ఇందులోకి బీజేపీని లాగొద్దని హెచ్చరించారు.
గతంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుని గెలిచిందని విమర్శించారు. 2004లో కాంగ్రెస్తో.. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. అలాగే 2014లో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పలేదా అని నిలదీశారు. ఆ తర్వాత పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించారు తప్ప.. రాష్ట్రానికి కల్వకుంట్ల కుటుంబం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను అతి దారుణంగా అవమానించారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని.. కేసీఆర్, కేటీఆర్, కవిత చెల్లని రూపాయిలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.