తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని సీనియర్ నేతలను బయటకు పంపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సీనియర్ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలోని కీలక నేతలను, ముఖ్యమంత్రిని రహస్యంగా కలిసి మంతనాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి స్వార్థపూరిత నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు.
రహస్య సమావేశాలు పెట్టుకుంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందా? అని ప్రశ్నించారు. దీనిపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలని సూచించారు. తనతో పాటు ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్తలు ఇదే కోరుకుంటున్నారని రాజాసింగ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణలో హిందువులకు రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. కాగా కొంతకాలం నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలతో రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.