Saturday, November 15, 2025
HomeతెలంగాణRajiv Yuva Vikasam : రాజీవ్ యువ వి'కాశం'.. కలల సాకారమెన్నడు? రుణమాఫీరికం ఎప్పుడు?

Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వి’కాశం’.. కలల సాకారమెన్నడు? రుణమాఫీరికం ఎప్పుడు?

Telangana youth self-employment scheme :  రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రకటించింది. లక్షలాది మంది యువత ఆశల పల్లకిలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, ఆరు నెలలు గడుస్తున్నా, ఈ పథకం అమలుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత కొరవడటంతో వారి ఆశలు అడియాశలవుతున్నాయి. ఇంతకీ ఈ పథకం పురోగతి ఏమిటి? లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయింది? ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి.

- Advertisement -

అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి : నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించి, వారు సొంతంగా యూనిట్లు స్థాపించుకునేందుకు చేయూతనివ్వాలని సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల నుంచి లక్షలాది దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్క నల్గొండ జిల్లా నుంచే 79,493 దరఖాస్తులు అందాయంటే యువత ఈ పథకంపై ఎన్ని ఆశలు పెట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వం తొలుత జూన్ 2న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని భావించింది. దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, సిబిల్ స్కోర్ల తనిఖీ వంటి ప్రక్రియలను అధికారులు ముమ్మరంగా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులతో జిల్లా, మండల స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేశాయి. అయితే, చివరి నిమిషంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో యావత్ ప్రక్రియకు బ్రేకులు పడినట్లయింది. అనర్హులకు లబ్ధి చేకూరకుండా పకడ్బందీగా వ్యవహరించాలనే ఉద్దేశంతో దరఖాస్తులను మరింత లోతుగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

రుణాల మంజూరులో సిబిల్ స్కోరు గండం : ఈ పథకం అమలులో సిబిల్ స్కోరు ప్రధాన అవరోధంగా మారింది. దరఖాస్తుదారుల సిబిల్ స్కోరు, వారి గత రుణాల చరిత్రను బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. గతంలో తీసుకున్న చిన్నపాటి రుణాలను సకాలంలో చెల్లించకపోవడం, సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది యువత సిబిల్ స్కోరు తక్కువగా ఉండటంతో వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 16 లక్షలకు పైగా దరఖాస్తుల్లో సుమారు 6.6 లక్షల దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడటం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఆర్థిక అక్షరాస్యత లోపం కూడా ఈ సమస్యను మరింత జఠిలం చేస్తోంది.

ప్రభుత్వ మౌనం.. యువత ఆందోళన : పథకం అమలుపై నెలకొన్న సందిగ్ధతతో దరఖాస్తు చేసుకున్న యువతలో తీవ్ర గందరగోళం, నిరాశ నెలకొన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా, అధికారుల నుంచి సరైన సమాధానం కరువైంది. ఎంపిక ప్రక్రియను నిలిపివేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో, వారు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పథకం ఆలస్యానికి ఒక కారణంగా తెలుస్తోంది. రాబడికి, వ్యయానికి మధ్య అంతరం పెరగడంతో కొత్త సంక్షేమ పథకాల అమలును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

పథకం స్వరూపం, సబ్సిడీ వివరాలు: ఈ పథకం కింద ఎంపికైన వారికి రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో కొంత భాగం బ్యాంకు రుణం కాగా, మిగిలినది వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రూపంలో లభిస్తుంది. రూ.50 వేల యూనిట్‌కు పూర్తి సబ్సిడీ ఉంటుంది. రూ.లక్ష లోపు రుణానికి 80%, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల లోపు రుణానికి 70%, రూ.4 లక్షల వరకు 60% సబ్సిడీ లభిస్తుంది. బ్యాంకు రుణం మంజూరు చేస్తేనే పథకం వర్తిస్తుంది.

ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పథకంపై నెలకొన్న నీలినీడలను తొలగించి, పారదర్శకమైన విధానంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని నిరుద్యోగ యువత కోరుతోంది. సిబిల్ స్కోరు వంటి నిబంధనలను సరళీకరించి, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని, యువత కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం  చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad