Rangareddy district Top in India: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా సరికొత్త రికార్డును నమోదు చేసింది. తలసరి స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీపీ పర్ క్యాపిటా) పరంగా భారతదేశంలో అత్యంత ధనిక జిల్లాగా అవతరించింది. గతంలో అగ్రస్థానంలో ఉన్న గురుగ్రామ్ (హరియాణా), బెంగళూరు అర్బన్ (కర్ణాటక) వంటి జిల్లాలు సైతం రంగారెడ్డి కంటే ఈసారి వెనుకబడ్డాయి.
ఎకనామిక్ సర్వే 2024-25 ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి జీడీపీలో దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రికార్డు సృష్టించింది. రంగారెడ్డి జిల్లా తలసరి జీడీపీ సుమారుగా రూ.11.46 లక్షలుగా ఉంది. ఇది భారత్లోని ఇతర జిల్లాల కంటే అత్యధికం కావడం గమనార్హం. పట్టణ అభివృద్ధి, మెట్రోపాలిటన్ మౌలిక సదుపాయాలు స్థానిక ఆర్థిక వ్యవస్థను ఎంతలా మార్చగలవో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని కొందరు ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలే ప్రగతికి బాట అని ..ఈ సర్వే ద్వారా అర్థం అవుతుంది.
అత్యంత ధనిక జిల్లాల జాబితా:
- రంగారెడ్డి తెలంగాణ రూ. 11.46 లక్షలు
- గురుగ్రామ్ హరియాణా రూ. 9.05 లక్షలు
- బెంగళూరు అర్బన్ కర్ణాటక రూ. 8.93 లక్షలు
- గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) యూపీ రూ. 8.48 లక్షలు
- సోలన్ హిమాచల్ ప్రదేశ్ రూ. 8.10 లక్షలు
- ఉత్తర, దక్షిణ గోవా గోవా రూ. 7.63 లక్షలు
- దక్షిణ కన్నడ (మంగళూరు) కర్ణాటక రూ. 6.69 లక్షలు.
- ముంబై మహారాష్ట్ర రూ. 6.57 లక్షలు
- అహ్మదాబాద్ గుజరాత్ రూ. 6.54 లక్షలు
రంగారెడ్డి జిల్లా అగ్రస్థానానికి గల కారణాలు:
హైదరాబాద్లోని ప్రధాన ఐటీ హబ్: రంగారెడ్డి జిల్లా సేవల రంగానికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో ఐటీ, ఐటీ అనుబంధ సేవల రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. సైబరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి హైదరాబాద్లోని ప్రధాన ఐటీ హబ్లకు ఈ జిల్లా ఆనుకొని ఉండటంతో.. రంగారెడ్డి జిల్లా మానవ వనరుల ఆకర్షణ కేంద్రంగా మారింది. ఐటీ రంగంలోని యువతకుఅధిక వేతనాలు రావడంతో జిల్లా తలసరి జీడీపీ పెరిగింది.
ఔషధ, బయోటెక్ పరిశ్రమలు: తెలంగాణ ఔషధ హబ్. అందులోని రంగారెడ్డి జిల్లా చుట్టూ అనేక ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగును . అంతే కాకుండా ఉత్పత్తి యూనిట్లు సైతం ఇక్కడ ఉండటం వలన ఆర్థిక వ్యవస్థకు అధిక విలువ, ఉద్యోగ కల్పన జరుగుతోంది.
రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి: ఈ జిల్లాలో ఐటీ, పారిశ్రామిక వృద్ధి ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ వృద్ధి నమోదైంది. భూముల ధరలు, ఆస్తుల విలువ పెరగడం కూడా జిల్లా తలసరి జీడీపీ పెరగడానికి ఒక ముఖ్య కారణం.
మౌలిక సదుపాయాలు: మౌలిక సదుపాయాలే ప్రగతికి బాట. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జిల్లాలోనే ఉంది. అంతే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు వంటి అత్యాధునిక రహదారులు, మెట్రోపాలిటన్ మౌలిక సదుపాయాలు ఈ జిల్లా సొంతం. అందుకే అనేక మంది పెట్టుబడుదారులను ఈ జిల్లా ఆకర్షించగలిగింది. దీంతో రంగారెడ్డి జిల్లా తలసరి జీడీపీలో దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రికార్డు సృష్టించింది.


