AusBiotech 2025: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో లైఫ్ సైన్సెస్ రంగానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025’లో ఆయన కీలకోపన్యాసం (Keynote Address) ఇవ్వనున్నారు. ఈ గౌరవం పొందిన దేశంలోనే ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం విశేషం.
ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ స్వయంగా మంత్రిని కలిసి ఆహ్వానం అందించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరగనున్న ఈ సదస్సులో, గత రెండేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన పురోగతిని మంత్రి ప్రపంచానికి వివరించనున్నారు.
80 బిలియన్ల డాలర్ల విలువైన తెలంగాణ లైఫ్ సైన్సెస్ పర్యావరణ వ్యవస్థను (Ecosystem) మంత్రి ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ముఖ్యంగా, ఫార్మా, బయోటెక్నాలజీ, మెడ్టెక్ ఆవిష్కరణలకు హైదరాబాద్ ఎలా ప్రపంచ కేంద్రంగా రూపాంతరం చెందిందో, ఈ రంగంలో రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు, ఆర్&డీ భాగస్వామ్యాలు, అధునాతన తయారీ (Advanced Manufacturing)లో ఆస్ట్రేలియా-తెలంగాణ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. ఈ ప్రసంగం ద్వారా రాష్ట్రానికి భారీగా కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు, గ్లోబల్ పార్టనర్షిప్లను నెలకొల్పేందుకు శ్రీధర్ బాబుకు గొప్ప అవకాశం దక్కింది. ఈ అంతర్జాతీయ గుర్తింపు తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో వేగవంతమైన పురోగతికి నిదర్శనం.


